Hyderabad Metro: త్రిశంకు స్వర్గంలో మెట్రో ఫేజ్-2

Hyderabad Metro: హైదరాబాద్ను విశ్వనగరంగా తీర్చిదిద్దే క్రమంలో ఎంతో కీలకమైనదిగా చెప్పుకునే మెట్రో పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది. రెండో దశ విస్తరణ ప్రణాళికలను కేంద్రం ఇంకా ఆమోదించలేదు. ఫేజ్-2 కింద దాదాపు 76 కిలోమీటర్ల పొడువుతో పలు మార్గాల్లో మెట్రోను విస్తరించేందుకు ఇప్పటికే ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 24 వేల కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్టుకు కేంద్రం ఆమోదం తెలపాల్సి ఉండగా తాజాగా నార్త్ సిటీ, ఫ్యూచర్ సిటీ వరకు మెట్రో విస్తరించాలని ప్రభుత్వం యోచిస్తోంది.
వీటిని ఫేజ్-2 పార్ట్ బీగా చేపట్టేందుకు డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టును మెట్రో సిద్ధం చేస్తోంది. అయితే పార్ట్-ఏ కు డీపీఆర్ అందజేసి నాలుగు నెలలు గడిచినా కేంద్రం ఇప్పటికీ ఆమోదించలేదు. నిత్యం మెట్రో అధికారులతో సంప్రదింపులు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా పార్ట్ బీలోని శామీర్ పేట్, మేడ్చల్, ఫ్యూచర్ సిటీ మార్గాలకు ఈ నెలాఖరులోగా డీపీఆర్ పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించినప్పటికీ కేంద్రం సంబంధిత డీపీఆర్ను ఆమోదిస్తే గానీ మెట్రో నిర్మాణం సాధ్యపడే పరిస్థితి లేదు.
మెట్రో సెకండ్ ఫేజ్లో భాగంగా నాగోల్ నుంచి శంషాబాద్, రాయదుర్గం నుంచి నియోపోలిస్, ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణ్ గుట్ట, మియాపూర్ నుంచి పటాన్చెరు, ఎల్బీనగర్ నుంచి హయత్ నగర్ వరకు మొత్తంగా 76.4 కిలోమీటర్ల మెట్రో నిర్మాణానికి డీపీఆర్ సిద్ధం చేసి కేంద్రానికి అందజేసింది. కేంద్ర, రాష్ట్ర భాగస్వామ్యంతో ప్రాజెక్టును చేపట్టేందుకు ప్రతిపాదించినా ఇప్పటివరకు ఫేజ్-2 పార్ట్ బీ డీపీఆర్కు కేంద్రం నుంచి ఆమోదం లభించలేదు.
నార్త్ తెలంగాణను అనుసంధానం చేయడంలో కీలకంగా మారిన నార్త్ సిటీ మెట్రో ప్రాజెక్టు ఇప్పుడు త్రిశంకు స్వర్గంలో ఉంది. జేబీఎస్ నుంచి శామీర్ పేట్, మేడ్చల్ వరకు రెండు మార్గాల్లో మెట్రో నిర్మిస్తామని హెచ్ఎంఆర్ఎల్ ప్రకటించింది. దాదాపు 45 కిలోమీటర్ల పొడువైన ఈ మార్గంతో నార్త్ సిటీ నుంచి కోర్ సిటీకి మెరుగైన రవాణా సదుపాయం అందుబాటులోకి వస్తోంది.
కానీ ఈ విషయంలో ప్రభుత్వం కొంత నిర్లక్ష్యం చేయడంతో పార్ట్ ఏ లోనే రావాల్సిన ప్రాజెక్టును పార్ట్ బీగా డీపీఆర్ సిద్ధం చేయాలని మెట్రో సంస్థను ఆదేశించింది. అయితే ఇటీవల నగరంలో మెట్రో విస్తరణ అంశంపై సీఎం రేవంత్ రెడ్డి నిర్వహించిన ఉన్నత స్థాయి సమావేశంలో పార్ట్ బీలో ఉన్న జేబీఎస్, శామీర్పేట్, మేడ్చల్ మార్గాన్ని ప్రస్తావించలేదు.
కానీ సీఎం రేవంత్ రెడ్డి డ్రీమ్ ప్రాజెక్టుగా చెప్పుకునే ఫ్యూచర్ సిటీ విస్తరణ, డీపీఆర్పై విస్తృతంగా అధికారులతో చర్చించారు. ఈ క్రమంలో పార్ట్ బీ డీపీఆర్ను అధికారులు సిద్ధం చేసినా కేంద్రం ఆమోదించేంత వరకు ఆగాల్సిందే. ఇప్పటికే రెండేళ్లుగా నార్త్ సిటీ మెట్రో కోసం స్థానికులు ఎదురుచూస్తున్న నేపథ్యంలో… ప్రభుత్వం చేస్తున్న జాప్యం ప్రాజెక్టును సందిగ్ధంలో పడేసింది. అదేవిధంగా కేంద్రం డీపీఆర్ ఆమోదించినా.. మిగిలిన ప్రాజెక్టుల కంటే ముందుగా శంషాబాద్ నుంచి ఫ్యూచర్ సిటీకి వెళ్లే మార్గాన్ని నిర్మించే అవకాశమే ఉంటుందని అంచనా వేస్తున్నారు.
పార్ట్ బీలో ఉన్న 85 కిలోమీటర్ల మేర మెట్రో ప్రాజెక్టుకు కనీసం 30వేల కోట్లకు పైగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో వీటిని కూడా కేంద్ర, రాష్ట్రాల వాటాలతో నిర్మించేందుకు తలపెట్టినా కేంద్రం నిధులు ఇచ్చేందుకు ఆమోదిస్తే గానీ ప్రాజెక్టును చేపట్టడం సాధ్యం కాదు. మెట్రో ఫేజ్-2లోని పార్ట్ ఏకు 25 వేల కోట్లు, పార్ట్ బీకి మరో 30 వేల కోట్ల ప్రాజెక్టులకు కేంద్రం ఆమోదించి కేంద్ర వాటాగా 18శాతం చొప్పున చెల్లించి, మిగిలిన మొత్తానికి ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకునేందుకు పూచీకత్తు అందిస్తే గానీ ప్రాజెక్టు పట్టాలెక్కదు. అయితే రాష్ట్ర ప్రభుత్వ ఖజానా ఖాళీగా ఉండటంతో నేరుగా ప్రాజెక్టుకు ఆర్థిక వనరులు సమకూర్చే వీల్లేని పరిస్థితుల నడుమ ప్రాజెక్టును ఎలా నిర్మిస్తారనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.