Hyderabad Metro: పాతబస్తీలో శరవేగంగా మెట్రో విస్తరణ పనులు

Hyderabad Metro: ఓల్డ్ సిటీ ప్రజల చిరకాల స్వప్నం సాకారం కాబోతోంది. మెట్రో రైలు పరుగులు పెట్టేందుకు మార్గం సుగమం అవుతోంది. ఎంజీబీఎస్ నుండి చంద్రాయణగుట్ట వరకు 7.5 కిలోమీటర్ల మార్గంలో మెట్రో రైలు విస్తరణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. పాతనగరం వాసుల కలలు నిజం కావడానికి మెట్రో అనుసంధానం చాలా కీలకం. ఈ మెట్రో మార్గం చాందినివాడ, యాకుత్పురా, ఫలక్నుమా లాంటి ప్రాంతాలకు మెట్రో లింక్ కల్పించనుంది. ఇది ఆర్ధిక, వాణిజ్య, సామాజిక వృద్ధికి దోహదపడుతుంది.
హైదరాబాద్లో మెట్రో రెండవ దశ విస్తరణ పనులు పాతనగరం వైపు వేగంగా సాగుతున్నాయి. ఎంజీబీఎస్ నుండి చాంద్రాయణగుట్ట వరకు 7.5 కిలోమీటర్ల పొడవున్న మెట్రో మార్గం నిర్మాణానికి సంబంధించిన పనులు ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్నాయి.
ఈ మార్గంలో మొత్తం 1,100 ఆస్తులు ప్రభావితమవుతున్నాయి. ఇప్పటివరకు 205 ఆస్తుల యజమానులకు నష్టపరిహారంగా రూ.212 కోట్లు చెల్లించారని అధికారులు తెలిపారు. మిగిలిన యజమానులతో కూడా చర్చలు కొనసాగుతున్నాయని, సహకారం వస్తున్నందుకు అధికారులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ప్రభావిత ఆస్తుల యజమానులు స్వచ్ఛందంగా స్పందించి ప్రభుత్వం నిర్ణయించిన నష్టపరిహారాన్ని ఆమోదించి ముందుకు వచ్చి తమ ఆస్తులను మెట్రో మార్గం కోసం ఇస్తున్నారు. ఈ మార్గంలో ఇరువైపులా చిక్కుముడులుగా ఉన్న కొన్ని క్లిష్టమైన విద్యుత్, టెలిఫోన్ కేబుళ్లను అత్యంత అప్రమత్తంగా తొలగించి తమ ఇంజినీరింగ్ సిబ్బంది మార్గాన్ని సుగమం చేసున్నారు.
మెట్రో అధికారులతో పాటు, రెవిన్యూ, పోలీస్ పర్యవేక్షణలో మెట్రో మార్గం విస్తరణ పనులు చురుకుగా సాగుతున్నాయి. ఇప్పటికే రోడ్డు విస్తరణ కోసం పలు భవనాలు, కట్టడాలను కూల్చివేసి, అవశేషాలను తొలగిస్తున్నారు. ఈ మార్గంలో ట్రాఫిక్ సమస్యను తగ్గించడానికి రోడ్డు విస్తరణ ఎంతో అవసరమని అధికారులు తెలిపారు.
సున్నితమైన కట్టడాలకు ఎటువంటి ముప్పు కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రంజాన్ సందర్భంగా విస్తరణ పనుల వేగం కొంత తగ్గినప్పటికీ, ఇప్పుడు అవి మళ్ళీ పుంజుకుని సజావుగా సాగుతున్నాయి. పాతనగరంలోని చారిత్రాత్మక కట్టడాలకు ఎటువంటి నష్టం జరగకుండా, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి మెట్రో పిల్లర్ల నిర్మాణం చేపట్టనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు త్వరితగతిన పాతనగరం విస్తరణ పనులు పూర్తి చేసి, కేంద్ర ప్రభుత్వ అనుమతి రాగానే మెట్రో నిర్మాణ పనులు ప్రారంభిస్తామని ఎన్వీఎస్ రెడ్డి వెల్లడించారు.
మెట్రో రైలు అందుబాటులోకి వస్తే పాతనగర ప్రజలకు ప్రయాణ సౌకర్యం మెరుగుపడుతుందని, ఆర్థికంగా అభివృద్ధి చెందుతుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు. మెట్రో రైలు ప్రాజెక్టు పూర్తయితే పాతనగరం రూపురేఖలు మారుతాయని, హైదరాబాద్ నగర అభివృద్ధికి ఇది ఒక మైలురాయిగా నిలుస్తుందని అధికారులు తెలిపారు.
పాతనగరం వాసుల కలలు నిజం కావడానికి మెట్రో అనుసంధానం చాలా కీలకం. ఈ మెట్రో మార్గం చాందినివాడ, యాకుత్పురా, ఫలక్నుమా లాంటి ప్రాంతాలకు మెట్రో లింక్ కల్పించనుంది. ఇది ఆర్ధిక, వాణిజ్య, సామాజిక వృద్ధికి దోహదపడుతుంది. రోజూ వేల మంది ప్రయాణికులు ఈ మార్గం ద్వారా ప్రయాణించే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా ఈ ప్రాజెక్టును వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్టు తెలిపారు. ఇప్పటికే ప్రారంభ పనులు పూర్తి చేసుకొని, కేంద్ర ప్రభుత్వ అనుమతులు రావడంతో పూర్తి స్థాయి నిర్మాణం త్వరలో ప్రారంభమవుతుందని వెల్లడించారు.