ఆంధ్ర ప్రదేశ్
క్షీర రామలింగేశ్వర స్వామి దర్శనానికి పోటెత్తిన భక్తులు

పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులోని క్షీర రామలింగేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. కార్తీక మాసం మూడో సోమవారం కావడంతో స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి కార్తీక దీపాలు వెలిగిస్తున్నారు భక్తులు. శివునికి అత్యంత ప్రీతికరమైన సోమవారం రోజు ఏకాదశ రుద్రాభిషేకాలు, పాశుపతి అభిషేకాలు, కేదారేశ్వర వ్రతాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ అర్చకులు తెలిపారు.
సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు త్వరితగతిన దర్శనం జరిగే విధంగా ఉచిత దర్శనం, శీఘ్ర దర్శనాలు ఏర్పాటు చేసినట్లు ఆలయ ఈవో చెప్పారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. భక్తుల సౌకర్యార్థం మంచినీరు, పాలు, ప్రసాదాలతో పాటు దాతల సహకారంతో అన్నదాన వితరణ ఏర్పాటు చేసినట్లు చెప్పారు.



