ఆంధ్ర ప్రదేశ్
కడప జిల్లా బయనపల్లెలో హైటెన్షన్

కడప జిల్లా బద్వేల్ మండలం బయనపల్లెలో హైటెన్షన్ కొనసాగుతోంది. కొందరు వైసీపీ నేతలు.. ఆక్రమణలు చేపట్టారంటోంది ఇరిగేషన్ టీమ్. ఇందులో భాగంగా వైసీపీ నేత శ్రీకాంత్ రెడ్డి.. చెరువులో గెస్ట్హౌస్ నిర్మించుకున్నారని చెబుతున్నారు. ఈ క్రమంలోనే కూల్చివేతలు ప్రారంభించారు. అయితే నోటీసులు ఇచ్చి కూల్చివేయాలంటున్నారు బాధితులు. దీంతో అధికారులు, వైసీపీ నేతలకు మధ్య వాగ్వాదం చెలరేగింది.
విషయం తెలుసుకున్న వైసీపీ ఎమ్మెల్సీ గోవింద రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇది ప్రజాస్వామ్యంపై జరుగుతున్న దాడిగా అభివర్ణించారు. శ్రీకాంత్ రెడ్డి ఇంటిని అక్రమంగా కూల్చుతున్నారంటూ మండిపడ్డారు. తొలుత బయనపల్లె చెరువును సర్వే చేయాలి తర్వాత అక్రమ నిర్మాణం అని తేలితే కూల్చాలన్నారు. అయినా నోటీసులు ఇవ్వకుండా ఎలా కూల్చుతారంటూ నిలదీశారు.