తెలంగాణ
కేతకి సంగమేశ్వర ఆలయానికి పోటెత్తిన భక్తులు

దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన సంగారెడ్డి జిల్లాలోని కేతకి సంగమేశ్వర ఆలయానికి భక్తులు పోటెత్తారు. మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులు దర్శనానికి భారీగా తరలి రావడంతో ఆలయ క్యూలైన్లు కిటకిటలాడుతున్నాయి. ఉమ్మడి మెదక్ జిల్లాతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర నుండి భక్తులు వస్తున్నారు. భక్తుల సౌకర్యార్థం దేవదాయ శాఖ ఆధ్వర్యంలో చలువ పందిళ్లు, తాగునీటి సౌకర్యం వంటి ఏర్పాట్లు చేశారు.
భక్తుల రద్దీ నియంత్రణ కోసం ప్రత్యేకంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. అంతేకాక దూర ప్రాంత భక్తుల రాకపోకల కోసం ఆర్టీసీ జహీరాబాద్ డిపో నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతోంది. ఆలయ దర్శనానికి వచ్చిన భక్తులు అమృతగుండంలో స్నానాలు ఆచరించి పార్వతీ సమేత సంగమేశ్వరుని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు.