తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు

Rains: తెలంగాణ వ్యాప్తంగా భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. గ్రేటర్లో మూడు రోజుల పాటు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అవరమైతే తప్ప బయటకు రావొద్దని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ ప్రజలకు సూచించారు.
ఎంతటి వానలు పడినా జీహెచ్ఎంసీ అన్ని విధాలా సిద్ధంగా ఉం దని, హైడ్రా, జలమండలి, వాటర్ బోర్డులతో కలిసి పని చేస్తున్నామన్నారు. గతేడాదితో పోలిస్తే ఈసారి ఎక్కువగా వర్షపాతం నమోదైందన్నారు.
కృష్ణా నగర్లో వరద వచ్చే ప్రాంతంలో ఇప్పటికే పనులు ప్రారంభించామని, మైత్రీవనం వద్ద వరద ప్రభావం లేకుండా సీఎం రేవంత్రెడ్డి ఆదేశాలతో ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేస్తున్నామన్నారు. సాయంత్రం సమయంలో ఎక్కువగా వర్షపాతం నమోదవుతుండడంతో ఐటీ కంపెనీలు లాగౌట్ టైమింగ్స్ చేంజ్చేసుకోవాలని సూచించినట్లు తెలిపారు. కంట్రోల్ రూమ్కు వచ్చే ఫిర్యాదులను వీలైనంత తొందరగా పరిష్కరిస్తున్నామన్నారు.
భారీ వర్షాల నేపథ్యంలో వ్యక్తిగత వాహనాల వినియోగం తగ్గించాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్ వాహనదారులను కోరారు. ఐటీ కంపెనీలు ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వాలని సూచించినట్లు తెలిపారు. 15 నుంచి 20 సెంటిమీటర్ల వర్షం కురిసే చాన్స్ ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు
అలాగే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలను ఈ రెండు రోజులు ఒంటిపూట బడులు నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశించింది. ఈ మేరకు మంగళవారం రాత్రి పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ ఉత్తర్వులు జారీచేశారు.
మరోవైపు, మూడు రోజుల పాటు అన్ని శాఖల ఉద్యోగులకు సెలవులు రద్దు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి జిల్లా కలెక్టర్లతో సీఎం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని ఇంఛార్జ్ మంత్రులు, అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.
ఆకస్మిక వరదలు వస్తే, ఎయిర్లిఫ్టింగ్కు హెలికాప్టర్లు సిద్ధంగా ఉండేలా చూడాలని తెలిపారు. అలాగే హైదరాబాద్లో వరదలపై హైడ్రా అలర్ట్గా ఉండాలని సూచించారు. ఐటీ ఉద్యోగులు వర్క్ఫ్రమ్ హోం చేసేలా అప్రమత్తం చేయాలని అధికారులను ఆదేశించారు.



