తెలంగాణ కాంగ్రెస్లో కొత్త పాలసీ తెర మీదకి వచ్చిందా..?

Telangana: ఇప్పటి దాకా ఓ లెక్క.. ఇక నుంచి మరో లెక్క అంటోందా హస్తం పార్టీ..? తెలంగాణ కాంగ్రెస్లో కొత్త పాలసీ తెర మీదకి వచ్చిందా..? పార్టీలో కొత్తగా చేరిన నేతలకు పార్టీ పదవులు, స్థానిక సంస్థల టికెట్లు కట్ కానున్నాయా..? కొత్తగా వచ్చిన నేతలు కనీసం 10 సంవత్సరాలు పార్టీలో పని చేయాల్సిందేనా..? కష్టకాలంలో పనిచేసిన నేతలకే ఇంపార్టెన్స్ ఉంటుందా..? కాంగ్రెస్ పాత నేతలకు న్యాయం చేయాలని చూస్తోందా..? గత స్థానిక సంస్థల ఎన్నికల్లో వ్యయ ప్రయాసలకోర్చిన పాత నేతలకే ప్రాధాన్యత ఇవ్వనున్నారా..? పార్టీ వర్గాల్లో ఎలాంటి చర్చ జరుగుతోంది..? లెట్స్ వాచ్ దిస్ రాజ్ న్యూస్ స్టోరీ.
ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనే సామెతను కాంగ్రెస్ నిజం చేయాలని భావిస్తోంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేనప్పుడు.. శ్రమించిన కార్యకర్తలకు, సెకండ్ క్యాడర్ నేతలకు ప్రాధాన్యత ఇవ్వాలని పార్టీ పెద్దలు భావిస్తున్నట్లు సమాచారం. కార్యకర్తల శ్రమతో పార్టీ అధికారంలోకి వచ్చిందని వారికి సరైన ప్రాధాన్యత ఇవ్వాలని పార్టీ నాయకత్వం నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా పార్టీ పెద్దలు A, B, C గ్రేడ్ లుగా కార్యకర్తలను, నాయకులను విభజించి మినిమం 10 సంవత్సరాలు ఆ పైకాలం పార్టీలో పని చేసిన వారిని A గ్రేడ్గా పార్టీ గుర్తించనుంది.
ముఖ్యంగా పార్టీ కష్టకాలంలో ఉన్న సమయంలో పార్టీ కోసం పని చేసిన సీనియర్ నేతలను కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీ గుర్తు మీద స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసిన వారికి ప్రియార్టీ ఇవ్వాలని పార్టీ నాయకత్వం భావిస్తోందట. మండలాల వారీగా గత స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసిన నేతల జాబితాలను తెప్పించుకునే పనిలో పీసీసీ పడిందట.
కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎంపీటీసీ, జెడ్పీటీసీ, కౌన్సిలర్లుగా పార్టీ సింబల్ మీద ఎవరు పోటీ చేశారు.. వారు ఎన్ని సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు ప్రస్తుతం వారు పార్టీలో ఏ పదవిలో ఉన్నారు.. ఈ అంశాలన్నీ కూడా తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ ఆరా తీస్తున్నారట. వాళ్ల జాబితాను తెప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారట. ఒకవేళ స్థానిక సంస్థల ఎన్నికల్లో గతంలో పోటీచేసిన కొన్ని స్థానాల్లోనైనా పాత రిజర్వేషన్లు వస్తే గత ఎన్నికల్లో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోటీ చేసిన వారికే. ఇప్పుడు అవకాశం కల్పించాలని పార్టీ పెద్దలు నిర్ణయానికి వచ్చారట.
ఎన్నికల ముందు కొత్తగా వచ్చిన నేతలను అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీలో చేరిన నేతలను పెద్దగా పట్టించుకోవద్దని పీసీసీ ముఖ్య నేతలకు తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ దిశా నిర్దేశం చేశారట. అందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీలో ఉన్న నేతలను మూడు గ్రేడ్ లుగా విభజించినట్లు పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక గ్రేడ్ Aలో ఉన్న నేతలకే ప్రాధాన్యత ఉండన్నట్లు గాంధీభవన్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
ఎన్నికలకు ముందు కాంగ్రెస్ గాలి వీస్తుందని తెలిసి హస్తం పార్టీ అధికారంలోకి వస్తుందని అంచనా వేసి కాంగ్రెస్లోకి వచ్చిన వాళ్లను B గ్రేడ్గా పార్టీ పెద్దలు పరిగణిస్తున్నారు. ఎన్నికల ముందు అనుకూల వాతావరణం ఏర్పడం వల్లే వాళ్లు కాంగ్రెస్లోకి వచ్చారని అంచనా వేస్తున్నారు. ఇలా ఎన్నికల ముందు పార్టీలో జాయిన్ ఐన వారు పార్టీ బలోపేతం కోసం కాకుండా కాంగ్రెస్ అధికారంలోకి వస్తే వారి పనులు చక్కదిద్దుకోవచ్చని రాజకీయ ప్రయోజనం కలుగుతుందనే ఉద్దేశంతోనే పార్టీలోకి వచ్చినట్లు హస్తం పెద్దలు లెక్కలు కడుతున్నారు. ఇలాంటివారు అధికారం కోల్పోతే పార్టీలో ఉండే అవకాశాలు తక్కువగా ఉంటాయి కాబట్టి ఇలాంటి వారికి స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీచేసే అవకాశం ఇవ్వకూడదని. తెలంగాణ కాంగ్రెస్ ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్.. ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.
ఎన్నికల ముందు వారి అవసరాల కోసం వచ్చిన నేతలను పెద్దగా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని పార్టీలోని సీనియర్ నేతలకు, ఎమ్మెల్యేలకు, మంత్రులకు మీనాక్షి నటరాజన్ చెప్పినట్లు సమాచారం. మినిమం పార్టీలో ఐదు నుండి 10 సంవత్సరాలు పనిచేసిన వారికే పదవులు ఇచ్చే విధంగా ఆలోచన చేయాలని తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్ నేతలకు చెప్పినట్లు తెలుస్తోంది.
దీంతో ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన నేతలకు నామినేటెడ్ పోస్టులు, స్థానిక సంస్థల ఎన్నికల్లో నిలబడే అవకాశం కానీ పార్టీలో పదవులు దక్కే వీలులేకుండా పోయిందని గాంధీభవన్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇక గ్రేడ్ C గా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్లో చేరిన నేతలను పార్టీ లెక్కగడుతోంది. వీరికి ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రాధాన్యత ఉన్న పదవులు ఇవ్వకూడదని పార్టీ నిర్ణయానికి వచ్చింది.
మీనాక్షి నటరాజ్ ఇన్చార్జ్గా వచ్చిన తర్వాత పాత కార్యకర్తలకు, నాయకులకు భరోసానిచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మొదటి నుండి పార్టీలో ఉన్న వారికే ప్రాధాన్యత ఇవ్వాలని ఆమె గట్టిగా పార్టీ నేతలకు ఆదేశాలు జారీ చేస్తున్నారు. దీంతో క్షేత్రస్థాయిలో మొదటి నుండి పార్టీలో ఉన్న కార్యకర్తలకు, నాయకులకు జోష్ వచ్చింది. మొన్నటి వరకు ముందొచ్చిన చెవుల కన్నా వెనుక వచ్చిన కొమ్ములు వాడిలాగా కొందరు కొత్తగా పార్టీలోకి వచ్చిన నేతలు ప్రవర్తించారని ఇకమీదట ఆ పరిస్థితి ఉండదంటున్నారు.
పార్టీలో కొత్తగా చేరిన నేతలు ఎంత ఓవరాక్షన్ చేసినా ఎంత లాబీయింగ్ చేసినా నేతలను ఎంత మచ్చిక చేసుకున్నా లాభం లేదనే సంకేతాలను.. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ పంపించారు. మొదటినుండి పార్టీలో కష్టపడిన నాయకులను గుర్తించే ఉద్దేశంతోనే.. మీనాక్షి నటరాజన్ను జాతీయ నాయకత్వం పంపించినట్లు తెలుస్తోంది.
మీనాక్షి నటరాజన్ మొదటి నుండి కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. NSUI లో ఆమె రాజకీయ ప్రస్తానం మొదలైంది. NSUI జాతీయ అధ్యక్షురాలుగా పనిచేసింది. ఒకసారి ఎంపీగా పనిచేసింది. గాంధీ కుటుంబానికి అత్యంత విధేయురాలు. దీంతో తెలంగాణలో నిజమైన కార్యకర్తలకు, మొదటి నుండి కాంగ్రెస్లో ఉన్న నేతలకు న్యాయం జరగాలంటే మీనాక్షితోనే సాధ్యం అనే ఉద్దేశంతోనే ఆమెను జాతీయ నాయకత్వం రంగంలోకి దించినట్టు తెలుస్తోంది.
ఆమె వచ్చినప్పటి నుండి పార్టీలో మొదటి నుండి పని చేసిన వారికే ప్రాధాన్యత ఇస్తానని చెప్తోంది. మాటల్లోనే కాకుండా చేతల్లో చూపించాలని నేతలకు ఆదేశాలు జారీ చేస్తోంది. పార్టీలో కొత్తగా చేరిన వారికి ఎట్టి పరిస్థితుల్లో కూడా పార్టీ పదవులు, స్థానిక సంస్థల్లో టికెట్లు, నామినేటెడ్ పోస్టులు ఇవ్వద్దని.. ఇప్పటికే మంత్రులు ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ ముఖ్య నేతలకు ఆదేశాలు జారీ చేసినట్లు గాంధీ భవన్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
మొదటి నుండి కాంగ్రెస్లో పని చేసిన కార్యకర్తలు మొన్నటి వరకు కూడా ప్రాధాన్యత ఇవ్వట్లేదని ఆందోళన చెందారు. ఇక మీనాక్షి నటరాజన్ ఇన్చార్జ్గా వచ్చిన తర్వాత మొదటి నుండి పార్టీలో ఉన్న వారికే ప్రియార్టీ ఇస్తామని చెప్పడంతో క్షేత్రస్థాయిలో ఉన్న కాంగ్రెస్ సెకండ్ కేడర్ నేతలకు కొత్త జోష్ వచ్చింది. మరి A, B, C గ్రేడ్లుగా కార్యకర్తలను, నాయకులను విభజించిన పార్టీ పెద్దలు నిజంగా పార్టీ కోసం పనిచేసిన వారికి రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో, నామినేటెడ్ పోస్టుల్లో, పార్టీ పదవుల్లో ప్రాధాన్యత ఇస్తారా లేరా అనేది వేచి చూడాలి.