నేడు కాళేశ్వరం కమిషన్ విచారణకు హరీష్ రావు

కాళేశ్వరం ఎత్తిపోతల్లోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలపై న్యాయ విచారణ నిర్వహిస్తున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఎదుట నీటిపారుదలశాఖ మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు నేడు హాజరు కానున్నారు. హైదరాబాద్లోని బీఆర్కే భవన్లో ఉన్న కాళేశ్వరం న్యాయ విచారణ కమిషన్ ముందుకు ఉదయం 11 గంటలకు హరీశ్రావు రానున్నారు.
మేడిగడ్డ బ్యారేజీ పియర్స్ కుంగిన, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో బుంగలు బయటపడిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది విచారణ కమిషన్ను నియమించింది. ఇప్పటి వరకు పలువురు అధికారులు, విశ్రాంత అధికారులను విచారించిన కమిషన్ నాటి ప్రభుత్వంలో కీలకమైన కేసీఆర్, హరీశ్రావు, ఈటల రాజేందర్లను విచారణకు హాజరు కావాలని ఇటీవల నోటీసులు జారీ చేసింది.
తాజాగా మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ను కమిషన్ విచారించింది. 11న మాజీ సీఎం కేసీఆర్ హాజరు కావాల్సి ఉంది. ఇవాళ హరీశ్రావు విచారణకు హాజరుకానున్న నేపథ్యంలో కమిషన్ కార్యాలయం ప్రాంతంలో బందోబస్తు పటిష్ఠం చేశారు.