Harish Rao: సెల్ఫోన్ లైట్ వెలుతురులో చికిత్స చేయాల్సిన దుస్థితి

Harish Rao: సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ఏరియా ఆసుపత్రిలో సెల్ ఫోన్ లైటు వెలుతురులో వైద్య సేవలు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. కరెంటు పోతే జనరేటర్లు పనిచేయకపోవడంతో సిబ్బంది సెల్ ఫోన్ లైటు వేసుకొని వైద్యం అందిస్తున్నారు. ఆసుపత్రి ఆవరణలో రెండు భారీ జనరేటర్లు ఉన్నప్పటికీ పూర్తిస్థాయిలోపని చేయడం లేదని ఆరోపణలు వస్తున్నాయి.
ఆసుపత్రిలో విద్యుత్ సరఫరా, జనరేటర్ విభాగాన్ని పర్యవేక్షించాల్సిన సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో తరచూ సమస్య తలెత్తుతోంది. శుక్రవారం రాత్రి పలువార్డులో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో రోగులతో పాటు వైద్యం అందించేందుకు సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
జహీరాబాద్ ఏరియా ఆస్పత్రి ఘటనపై బీఆర్ఎస్ నేత హరీశ్ రావు స్పందించారు. సెల్ ఫోన్ టార్చ్ వెలుతురులో వైద్యంపై మండిపడ్డారు. ఒకవైపు కరెంట్ కోతలు, మరోవైపు ఆస్పత్రిలో జనరేటర్ పనిచేయదన్నారు.
చివరకు సెల్ఫోన్ లైట్ వెలుతురులో చికిత్స చేయాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. ఏడాదిన్నరగా పాలన పడకేసిందని విమర్శించారు హరీశ్. జహీరాబాద్ లోనే పరిస్థితి ఇలా ఉంటే గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితి ఏంటని ఆయన ప్రశ్నించారు.