Harish Rao: రేవంత్ రెడ్డిని చూసి ఊసరవెల్లులు కూడా సిగ్గుపడుతాయి

Harish Rao: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రంగా విమర్శలు చేశారు. రేవంత్ రెడ్డి చొక్కాలు మార్చినంత ఈజీగా పార్టీలు మారుస్తారని అన్నారు. ఆయనను చూసి ఊసరవెల్లులు కూడా సిగ్గుపడతాయంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డికి నీతి, విలువలు ఉన్నాయా అని ప్రశ్నించారు. కేసీఆర్ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా రేవంత్ రెడ్డి రౌడీలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఇలాంటి భాష వాడటం సరికాదన్నారు.
రాష్ట్రంలో జీఎస్డీపీ మూడు రెట్లు పెరిగిందన్నది, తలసరి ఆదాయం పెరిగిందన్నది వాస్తవమేనని హరీష్ రావు చెప్పారు. రాజకీయ లాభాల కోసం రాష్ట్ర పరువు తీయొద్దని సీఎం రేవంత్ రెడ్డికి సూచించారు. రూ.50 కోట్లతో పీసీసీ చీఫ్ పదవి కొనుగోలు చేశారని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు.
సొంత పార్టీ నేతలను తొక్కుకుంటూ తాను ఎదిగినట్లు రేవంత్ రెడ్డే ఒప్పుకున్నారని అన్నారు. నిజాయితీ, త్యాగాల పునాదులపై ఎదిగిన నాయకత్వమని హరీష్ రావు అన్నారు. పుట్టుక, చదువు, ఉద్యోగం అన్నీ ఒకే చోట కొనసాగిస్తున్నామని చెప్పారు. కానీ రేవంత్ రెడ్డి రేపు ఎక్కడ ఉంటారో కూడా తెలియదంటూ సెటైర్లు వేశారు. ఎమ్మెల్యే, మంత్రి పదవులను గడ్డిపరకల్లా వదిలిన చరిత్ర బీఆర్ఎస్ నేతలదని అన్నారు.
పార్టీలు మార్చడంలో రేవంత్ రెడ్డికి ప్రత్యేక చరిత్ర ఉందని విమర్శించారు. కేసీఆర్ ప్రెస్మీట్ పెట్టిన వెంటనే రేవంత్ రెడ్డి చిట్చాట్ పెట్టడం ఆయన మనస్తత్వాన్ని చూపిస్తోందని అన్నారు. ఇలాంటి తీరుతో ముఖ్యమంత్రిగా వ్యవహరించడం సరికాదంటూ హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.



