AP News: అక్కాచెల్లెళ్లను మ్యారేజ్ చేసుకోవడానికి సిద్ధమైన యువకుడు

AP News: సత్యసాయి జిల్లాలో యువకుడు అక్కాచెల్లెళ్లను మ్యారేజ్ చేసుకోవడానికి సిద్ధమయ్యాడు. అందుకు ఇరు కుటుంబాలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. పెళ్లి కోసం ఏర్పాట్లు అంతా రెడీ చేశారు. కాకపోతే శుభలేఖ వ్యవహారం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అర్థాంతరం ఆ పెళ్లి ఆగిపోయింది.
పెనుగొండ నియోజకవర్గంలోని గుమ్మయగారి పల్లి గ్రామం నారీ నారీ నడుమ మురారి పెళ్లికి వేదికైంది. ఈ ప్రాంతానికి చెందిన గంగరాజు ఇద్దరు అమ్మాయిలతో పెళ్లికి సిద్దమయాడు. కర్ణాటకలోని చిక్బల్లూరు ప్రాంతానికి చెందిన యువతులతో గంగరాజుకు నిశ్చితార్థం జరిగింది.
అమ్మాయిలిద్దరు మైనర్ బాలికలు కావడంతో విషయం ఐసీడీఎస్ అధికారుల దృష్టికి వెళ్లింది. మ్యారేజ్కు రెండురోజుల ముందు అమ్మాయి ఇంటికి వచ్చారు పోలీసులతోపాటు అధికారులు. మైనర్లకు వివాహం చేయడం చట్ట విరుద్ధమని వారికి చెప్పారు.
ఇరు కుటుంబాలు ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలని లేకుంటే కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. చివరి సమయంలో ఇలా చేయడం బాగా లేదని చెప్పే ప్రయత్నం చేశాయి ఆ కుటుంబాలు. కనీసం ఒక్క అమ్మాయితో వివాహం జరిపించాలని ప్రాధేయపడ్డారు.
అందుకు అధికారులు ససేమిరా అన్నారు. చట్టాన్ని అతిక్రమించడానికి వీల్లేదన్నారు. చిన్న వయస్సులో పెళ్లి చేస్తే ఎదురయ్యే సమస్యలను ఆయా కుటుంబాలకు వివరించారు. చేసేదేమీ లేక ఆ పెళ్లి కాస్త వాయిదా పడిపోయింది. అమ్మాయిల తరపు బంధువులు, అబ్బాయి తరపు బంధువులకు కౌన్సిలింగ్ ఇచ్చారు ఐసీడీఎస్ అధికారులు, పోలీసులు. దీంతో నారీ నారీ నడుమ మురారి పెళ్లి కాస్త ఆగిపోయింది.