జాతియం

Delhi Air Pollution: ఢిల్లీలో ప్రమాదకరంగా వాయుకాలుష్యం

Delhi Air Pollution: దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం స్థాయి ఆందోళనకరంగా పెరిగింది. 400 మార్క్ దాటింది వాయునాణ్యత సూచీ. దీంతో పట్ట పగలే ఢిల్లీలో చిమ్మ చీకట్లు కనిపిస్తున్నాయి. దగ్గు,గొంతు నొప్పి, కళ్ల మంటలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.రానున్న రోజుల్లో వాయుకాలుష్యం మరింత పెరిగే ప్రమాదం ఉంది. ఢిల్లీలోని పలు ప్రాంతాలలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ తీవ్రమైన స్థాయికి చేరుకుంది, సగటు AQI చాలా పేలవం కేటగిరీని దాటింది.

దీంతో కాలుష్య నియంత్రణ చర్యలను మరింత కఠినతరం చేస్తూ, గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ లోని స్టేజ్-2 ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. ప్రతికూల వాతావరణ పరిస్థితులు, వాహనాల కాలుష్యం, చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చే పొగ, పండుగల సందడి కారణంగా ఈ కాలుష్య స్థాయి పెరిగినట్లు అధికారులు తెలిపారు.

ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ కమిషన్ ఈ పరిస్థితిని సమీక్షించి, కాలుష్య తీవ్రతను తగ్గించేందుకు తక్షణమే GRAP స్టేజ్-2 కింద చర్యలను అమలు చేయాలని ఆదేశించింది. ఇప్పటికే అమలులో ఉన్న స్టేజ్-1 నిబంధనలకు అదనంగా ఈ కొత్త ఆంక్షలు వర్తిస్తాయి. అత్యవసర సేవలకు మినహా, ఢిల్లీ-NCR ప్రాంతంలో డీజిల్ జనరేటర్ సెట్ల వాడకాన్ని నిషేధించారు. ధూళి నియంత్రణ చర్యలను పాటించని నిర్మాణ, కూల్చివేత స్థలాలపై తనిఖీలను ముమ్మరం చేసి, కఠిన జరిమానాలు విధిస్తారు. హోటళ్లు, రెస్టారెంట్లు బహిరంగ ఆహార విక్రయశాలల్లో బొగ్గు, వంటచెరుకు వాడకాన్ని నిషేధించారు.

దుమ్ము కాలుష్యాన్ని తగ్గించేందుకు రోడ్లపై రోజూ వాక్యూమ్ స్వీపింగ్, నీరు చల్లడం తప్పనిసరి చేశారు. కాలుష్యాన్ని ఎదుర్కోవడంలో పౌరులు సహకరించాలని, వీలైనంత వరకు ప్రజా రవాణాను ఉపయోగించాలని, బహిరంగంగా చెత్త లేదా బయోమాస్‌ను దహనం చేయవద్దని విజ్ఞప్తి చేసింది. రాబోయే రోజుల్లో కాలుష్య స్థాయిలు మరింత పెరిగే అవకాశం ఉన్నందున, ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు హెచ్చరించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button