బాసరలో ఉప్పొంగుతున్న గోదావరి

నిర్మల్ జిల్లా బాసర గోదావరి నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. ఎగువన మహారాష్ట్రలో భారీగా కురుస్తున్న వర్షాలకు బాసర వద్ద గోదావరి నదికి రెండు రోజుల నుండి వరద ఉధృతి క్రమక్రమంగా పెరుగుతోంది. తెలంగాణ సరిహద్దులో ఉన్న మహారాష్ట్రలోని నాందేడ్ పర్బాని జిల్లా పరిధిలో వర్షాలు ఏకధాటిగా కురుస్తుండడంతో గోదావరి నదికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. వరద ఉధృతి పెరుగుతుండడంతో గోదావరి నది తీరం వద్ద భక్తుల పుణ్య స్నానాల ఘట్టాల వద్ద పోలీసులు అనుమతి ఇవ్వడం లేదు.
నది లోపలికి వెళ్లకుండా ప్రత్యేకంగా భారికేడ్లు ఏర్పాటు చేశారు. గోదావరి బ్యాక్ వాటర్తో ఆలయం నుంచి గోదావరి నదికి ఉండే మార్గంలో వరద నీరు వచ్చి చేరడంతో రాకపోకలు నిలిచిపోయాయి. పోలీసులు, రెవెన్యూ అధికారులు గోదావరి నది వద్ద ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు. రానున్న నాలుగు రోజులు వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలపడంతో గోదావరి లోతట్టు ప్రాంత ప్రజల అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.



