Nepal: నేపాల్లో మరోసారి జెన్-జీ ఆందోళనలు

Nepal: జెన్ జెడ్ యువత నిరసనలతో నేపాల్లో మళ్లీ అలర్లు చెలరేగాయి. జెన్ జెడ్ యువత మరోసారి రోడ్డెక్కారు. బారా జిల్లాలో మాజీ ప్రధాన మంత్రి కేపీ శర్మ ఓలి నేతృత్వంలోని కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్ -యూనిఫైడ్ మార్క్సిస్ట్ లెనినిస్ట్ మద్దతుదారులు, జెన్ జెడ్ యువత మధ్య వివాదం తలెత్తింది. రెండు గ్రూపుల మధ్య వివాదం ముదిరి ఘర్షణలు చెలరేగాయి.
రెండు వర్గాలు పరస్పరం దాడులు చేసుకున్నాయి. వెంటనే అప్రమత్తమైన పోలీసులు రంగంలోకి దిగి ఇరువర్గాలను చెదరగొట్టారు. సిమారా ఎయిర్పోర్టులో కార్యకలాపాలను అధికారులు బంద్ చేశారు. నిరసనకారులపై అధికారులు టియర్ గ్యాస్ను ప్రయోగించారు.
నేపాల్లో సోషల్ మీడియాపై నిషేధం విధించడంతో పాటు ప్రభుత్వ అవినీతికి వ్యతిరేకంగా జెన్ జెడ్ యువత ఉద్యమబాట పట్టారు. దేశవ్యాప్తంగా యువత రోడ్డెక్కి పెద్ద ఎత్తున నిరసనలు చేశారు. అప్పటి ప్రధాన మంత్రి, మంత్రుల నివాసాలపై దాడులు చేశారు.
ప్రధాని, రాష్ట్రపతి నివాసాలను ముట్టడించారు. జెన్ జెడ్ యువత నిరసనలో అల్లర్లు చెలరేగి తీవ్ర హింసాత్మకంగా మారింది. జెన్ జెడ్ యువత ఆందోళనల్లో కనీసం 76 మంది మరణించారు. వందల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు. జెన్ జెడ్ యువత దెబ్బకు కేపీ శర్మ ఓలీ ప్రభుత్వం కుప్పకూలింది.



