Jaipur: ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం.. ఐసీయూలో ఆరుగురు మృతి

Jaipur: రాజస్థాన్లో ఘోరం చోటు చేసుకుంది. జైపూర్లోని ఓ ఆస్పత్రి ఐసీయూలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఇప్పటిదాకా ఆరుగురు మృతి చెందగా, పలువురికి గాయాలయ్యాయి. పలువురి పరిస్థితి విషమంగా ఉండడంతో మృతుల సంఖ్య పెరగవచ్చని తెలుస్తోంది. జైపూర్లోని సవాయ SMS ఆస్పత్రిలో ఈ ఘోరం చోటు చేసుకుంది. రెండో అంతస్తులోని ఐసీయూలో షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని చెలరేగి ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది.
ప్రమాదంలో ఐసీయూలో ఉన్న వైర్లు, ఫైల్స్ కాలిపోయి మంటలు మరింత వేగంగా వ్యాపించాయి. ఆపై విషపు వాయివులు వెలువడడంతో పేషెంట్లు ఉక్కిరి బిక్కిరి అయ్యారు. ఈ ఘటనలో అక్కడిక్కడే ఆరుగురు చనిపోయారు. మరో ఐదుగురికి సీరియస్గా ఉన్నట్లు తెలుస్తోంది. గాయపడిన మరికొందరికి చికిత్స అందుతోంది.
ఘటన సమయంలో ఐసీయూ, సెమీ ఐసీయూలో కలిపి 24 మంది పేషెంట్లు ఉన్నట్లు ఆస్పత్రి నిర్వాహకులు తెలిపారు. ప్రమాదంతో దట్టమైన పొగ అలుముకోగా ఆస్పత్రిలో తీవ్ర గందరగోళం నెలకొంది. ప్రాణ భయంతో అంతా బయటకు పరుగులు తీశారు. రంగంలోకి దిగిన ఫైర్ సిబ్బంది రెండు గంటలపాటు శ్రమించి మంటల్ని అదుపు చేసినట్లు సమాచారం.



