అకాల వర్షం.. అన్నదాత ఆగం

అకాల వర్షాలు అన్నదాతను ఆగం చేస్తున్నాయి. ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యం రాసులు అకాల వర్షాలకు తడిసి ముద్దవుతున్నాయి. ఇందూరు జిల్లాలో ధాన్యం కొనుగోలులో అడుగడుగునా కష్టాలు ఎదురవుతున్నాయి. ధాన్యం ఆరబోసేందుకు కల్లాలు లేక.. కొనుగోళ్లు నత్తనడకన సాగుతున్నాయి. దీంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాను ధాన్యభాండాగారంగా కూడా పిలుస్తారు. రాష్ట్రంలో వరి సాగు ఈ జిల్లాలోనే ఎక్కువగా సాగుతోంది. అయితే ఇప్పటికే జిల్లాలో వరి కోతలు కోసి,కొనుగోలు కేంద్రాలకు తరలించారు. అయితే కల్లాలు తక్కువగా ఉండటంతో రైతులు కోసిన ధాన్యాన్ని రోడ్ల వెంట, కొనుగోలు కేంద్రాలలో ఆరబోసి కొనుగోళ్ల కోసం ఎదురు చూస్తున్నారు. అకాల వర్షాలు రైతులను భయపెడుతుండటంతో ధాన్యాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు.
అయితే జిల్లాలో మహిళా సంఘాలతో పాటు సహకార సంఘాల ద్వారా కొనుగోలు మొదలు పెట్టినప్పటికీ కాంటాలు అలస్యం కాగా.. కొనుగోల్లు ఇంకా పూర్తికాకపోవడం వల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారు. అకాల వర్షాల నేపధ్యంలో ఇప్పటికే భారీగా పంట దెబ్బతింది. మరోవైపు చాలా చోట్ల ధాన్యం తడిసి ముద్దయింది. దీంతో ధాన్యం కొనుగోలు త్వరగా చేయాలని అన్నదాతలు కోరుతున్నారు.