Earthquake: నేపాల్-టిబెట్ సరిహద్దుల్లో భారీ భూకంపం.. 53కు చేరిన మృతులు

Earthquake: హిమాలయ దేశాలు నేపాల్-టిబెట్ సరిహద్దులను భారీ భూకంపం వణికించింది. ఉదయం 7.1 తీవ్రతతో సంభవించిన భూకంపంలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఈ విపత్తు కారణంగా టిబెట్లో ఇప్పటివరకు కనీసం 53 మంది మృతి చెందగా… మరో 62 మంది గాయపడినట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం.
నేపాల్-టిబెట్ సరిహద్దుకు 93 కిలోమీటర్ల దూరంలో ఉన్న లబుచె ప్రాంతంలో ఇవాళ ఉదయం 6.35 గంటలకు ఈ భూకంపం సంభవించింది. టిబెట్లోని షిజాంగ్లో 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు నేపాల్ అధికారులు వెల్లడించారు. కొన్ని క్షణాల పాటు తీవ్రస్థాయిలో ప్రకంపనలు రావడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.
ఈ భూకంపం తర్వాత టిబెట్ రీజియన్లో మరో రెండుసార్లు ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. వీటి తీవ్రత 4.7, 4.9గా నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. భూకంప కేంద్రం ఉన్న టిబెట్ ప్రాంతంలో పలు భవనాలు నేలమట్టమయ్యాయి. శిథిలాల కింద పలువురు చిక్కుకున్నట్లు సమాచారం.