Dwaraka Tirumala: కన్నుల పండుగగా ద్వారకాతిరుమల చినవెంకన్న కళ్యాణం

Dwaraka Tirumala: ఏలూరు జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకాతిరుమల చిన వెంకన్న కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది. శ్రీదేవి భూదేవి సమెతుడైన ఆ శ్రీనివాసుని కళ్యాణాన్ని తిలకించిన భక్తులు ఆనంద పారవశ్యంలో మునిగితేలారు. స్వామివారి వివాహ మహోత్సవానికి ఆలయ తూర్పు రాజగోపురం ముందు ప్రత్యేక కల్యాణ మండపాన్ని ఏర్పాటు చేశారు. ముందుగా స్వామి, అమ్మవార్లను వేర్వేరు వాహనాల్లో కళ్యాణ మండపానికి తీసుకువెళ్లారు.
అక్కడ అర్చకులు స్వామి, అమ్మవార్ల కళ్యాణమూర్తులను ప్రత్యేక పూలతో అలంకరించారు. స్వామి అమ్మవార్లకు గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు, ఆలయ చైర్మన్ ఎస్ వి సుధాకర్ రావు పట్టు వస్త్రాలు సమర్పించారు. శుభ ముహూర్త సమయాన మంగళ వాయిద్యాలు మేళ తాళాలు నడుమ వేదమంత్రాల సాక్షిగా అర్చకులు జీలకర్ర బెల్లం పూర్తి చేశారు. అనంతరం స్వామివారి కల్యాణ మహోత్సవం నిర్వహించారు.