సినిమా

చిరంజీవిని బాలయ్య టార్గెట్ చేశారా..?

మెగాస్టార్‌ను మరోసారి నందమూరి నటసింహం టార్గెట్ చేసిందా..! బాలయ్య చేసిన కామెంట్స్ చిరు కోసమేనా..! అంటే అవుననే సమాధానమే వస్తోందట. బాలయ్య వ్యాఖ్యలపై ఇటు పొలిటికల్ సర్కిల్స్‌లో అటు టాలీవుడ్‌‌లో డిస్కషన్ జరుగుతోంది. మరోసారి చిరంజీవిని లక్ష్యంగా చేసుకుని బాలయ్య డైలాగులు పేల్చారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయట. ఇంతకూ బాలయ్య ఏం కామెంట్స్ చేశారు.. అందుకు చిరు ఫ్యాన్స్ రియాక్షన్ ఏంటి లెట్స్ వాచ్ దిస్ స్టోరీ..

సీనియర్ నటుడు, నందమూరి నటసింహం బాలకృష్ణ రూటే సెపరేటు. స్టేజ్‌పై మైక్ పట్టుకుంటే చాలు ఏదైనా మాట్లాడేస్తారు. తర్వాత ఏం జరుగుతుందోనన్న విషయం పక్కనపెడితే తన మనసులోని భావాలన్నింటినీ బయటపెడుతుంటారు. అలా బాలయ్య మాట్లాడిన మాటలు చాలాసార్లు వివాదాస్పదమయ్యాయి. తాజాగా హిందూపురం నియోజకవర్గ ప్రజలు ఏర్పాటు చేసిన సన్మాన సభలో నట సింహం చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి.

రీసెంట్‌గా బాలకృష్ణ పద్మభూషణ్ పురస్కారం అందుకున్నారు. దీంతో ఆయన ఎమ్మెల్యేగా ఉన్న హిందూపురం నియోజకవర్గ ప్రజలు సన్మాన సభను ఏర్పాటు చేశారు. సభలో మాట్లాడిన బాలయ్య 50 ఏళ్లపాటు హీరోగా కొనసాగిన వ్యక్తి మరొకరు లేరని తెలిపారు. తనను చూసి తనకు పొగరని వ్యాఖ్యానించారు. ఈ సమయంలోనే ఆయన తన రాజకీయ జీవితంపై కూడా మాట్లాడారు.

నటులు ఎమ్మెల్యేలుగా మారడం ఎల్లప్పుడూ విజయవంతం కాదని ఆయన వ్యాఖ్యానించారు. ఓ నటుడు అయినంత మాత్రాన ఎమ్మెల్యే అవ్వాలని లేదని అన్నారు. హిందూపురంలో తాను పనులు చేశానని అందుకే తనను గెలిపించుకున్నారని చెప్పారు.

ఎన్.టి. రామారావు కొడుకును అయినంత మాత్రాన తాను ఎన్నిక కాలేదని బాలకృష్ణ చెప్పారు. చాలా మంది సినిమా నటులు రాజకీయాల్లోకి ప్రవేశించి అడ్రస్ లేకుండా పోయారని ఘాటుగా వ్యాఖ్యానించారు. రాజకీయాల్లోకి చాలామంది నటులు వచ్చారు. నామరూపాలు లేకుండా పోయారని హాట్ కామెంట్స్ చేశారు. సమాజంలో తమవంతు బాధ్యత ఉండాలని బాలయ్య అన్నారు. అలాంటప్పుడే ప్రజల్లో ఆధరణ ఉంటుందని అన్నారు. దీంతో ఆయన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. బాలయ్య ఎవరిని ఉద్దేశించి మాట్లాడారోనని అంతా డిస్కస్ చేసుకుంటున్నారు.

బాలకృష్ణ ఎవరిని ఉద్దేశించి ఇటువంటి వ్యాఖ్యలు చేశారని చర్చ జరుగుతోంది. బాలయ్య డైలాగులు వింటే ఠక్కున గుర్తొచ్చే పేరు చిరంజీవేనట. మెగాస్టార్ చిరంజీవిని ఉద్దేశించే బాలకృష్ణ ఈ వ్యాఖ్యలు చేశారని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారట. చిరంజీవి గతంలో ప్రజారాజ్యం పార్టీ పెట్టారు.

అయితే ఎన్నికల్లో ఓడిపోవడంతో ఆయన తన పార్టీని ముందుకు నడిపించలేకపోయారు. దీంతో ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. ఆ తర్వాత చిరంజీవి క్రియాశీల రాజకీయల నుంచి తప్పుకున్నారు. దీంతో చిరంజీవిని ఉద్దేశించే బాలకృష్ణ ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారని నెటిజన్లు అనుకుంటున్నారట.

ఇప్పుడైతే మెగా ఫ్యామిలీ, నందమూరి ఫ్యామిలీ కలిసిపోయారు కానీ గతంలో ఈ రెండు ఫ్యామిలీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉండేది. పైకి బాగానే ఉన్నప్పటికి లోలోపల మాత్రం ఈ రెండు ఫ్యామిలీల మధ్య ఆధిపత్య పోరు కొనసాగింది. ముఖ్యంగా నందమూరి నటసింహం బాలకృష్ణ అవకాశం చిక్కినప్పుడల్లా మెగా ఫ్యామిలీ మీద తన అక్కసును వెళ్లగక్కేవారు. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టిన సమయంలో ఆయనపై బాలకృష్ణ ఓ రేంజ్‌లో ఫైరయ్యారు.

రాజకీయాలు అంటే ఎమోషన్ కాదన్నారు. అమితాబ్ బచ్చన్ రాజకీయాల్లోకి వచ్చి ఏం పీకాడు గొప్ప నాయకుడిని ఓడించి పార్లమెంట్‌కి వెళ్ళాడు. అక్కడ ఆటోగ్రాఫ్స్ ఇవ్వడమే సరిపోయింది. చిరంజీవి కూడా అంతే రాజకీయాల్లో అందరూ రాణించలేరని అన్నారు. తమ బ్లడ్ వేరు బ్రీడ్ వేరు అంటూ చిరంజీవి స్థాయిని తగ్గించి మాట్లాడారు. చిరంజీవి మీద బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలకు అప్పట్లో మెగా బ్రదర్ నాగబాబు గట్టిగానే కౌంటరిచ్చేవారు.

బ్లడ్, బ్రీడ్ అనేది జంతువులకు మాత్రమే ఉంటుంది. అమితాబ్, చిరంజీవిని విమర్శించే స్థాయి నీది కాదంటూ బాలకృష్ణపై నాగబాబు వరుస వీడియోలు చేశాడు. ఇక ఆ తర్వాత కూడా బాలకృష్ణ మెగా ఫ్యామిలీపై తన విమర్శలను కొనసాగించారు. పవన్ కళ్యాణ్ ఎవరో తనకు తెలియదని బాలకృష్ణ సెటైర్లు వేశారు. జనసేన సభలకు వెళ్లేవారు అలగా జనం అంటూ హేళనగా మాట్లాడారు.

బాలకృష్ణ వ్యాఖ్యలపై పవన్ కళ్యాణ్ సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే 2014 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ సాయంతో అధికారంలోకి వచ్చింది టీడీపీ. తర్వాత జరిగిన పరిణామాలతో ఈ రెండు ఫ్యామిలీలు కలిసిపోయాయి. అయితే తాజాగా బాలకృష్ణ మరోసారి తన నోటికి పని చెప్పారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు.

మరోవైపు బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు చిరంజీవిని ఉద్దేశించినవి కాదనే టాక్ కూడా వినిపిస్తోంది. ఎందుకంటే టీడీపీ, జనసేన పార్టీలు ఒకే కూటమిలో ఉన్నాయి. చిరు తమ్ముడు పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన కూటమిలో ఉండడంతో. మెగాస్టార్ ఫ్యామిలీతో నందమూరి ఫ్యామిలీ పొత్తు పెట్టుకున్నట్లే. కాబట్టి చిరును ఉద్దేశించే బాలయ్య ఆ వ్యాఖ్యలు చేశారని చెప్పలేమంటున్నారు కొందరు.

చిరంజీవి కాకుండా కైకాల సత్యనారాయణ, కోట శ్రీనివాసరావు, శారద, జమున వంటి చాలా మంది రాజకీయాల్లోకి అడుగుపెట్టి ఆ తర్వాత అదృశ్యమయ్యారు. దీంతో వాళ్లను ఉద్దేశించి మాట్లాడారేమోనని కొందరు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారట. పొరుగు రాష్ట్రాల నటులను కూడా లక్ష్యంగా చేసుకుని మాట్లాడి ఉండవచ్చంటున్నారు.

ఏదేమైనా బాలయ్య స్పీచ్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. బాలయ్య ఎవరిని ఉద్దేశించి అన్నారో తెలియదు కానీ ఆయన వ్యాఖ్యలు మాత్రం తెగ వైరల్ అవుతున్నాయి. బాలయ్య క్యాజువల్‌గా అలా ఫ్లోలో మాట్లాడారా లేక ఎవరినైనా టార్గెట్ చేసి మాట్లాడారా ఆయనకే తెలియాలి. ఎందుకంటే ఆయన బాలయ్య మరి.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button