జాతియం

Mahakumbh Mela: మహా కుంభమేళాకు భారీగా పోటెత్తిన భక్తులు

Mahakumbh Mela: ప్రపంచంలో అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక అయిన మహా కుంభమేళా భక్త జనసంద్రాన్ని తలపిస్తోంది. ప్రయాగ్‌రాజ్ త్రివేణి సంగమానికి భక్తులు పోటెత్తారు.మహాకుంభమేళాలో పుణ్యస్నానాలు చేసేందుకు భారీగా తరలివచ్చారు. దీంతో ప్రయాగ్‌రాజ్ ఘాట్లన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. గంగ, యమున, సరస్వతి నదులు కలిసే పవిత్ర త్రివేణీ సంగమంలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు.

ఈ క్రమంలో కుంభమేళా ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకూ రికార్డు స్థాయిలో భక్తులు ప్రయాగ్‌రాజ్‌ను సందర్శించారు. ఈ మేళా జరుగుతున్న త్రివేణి సంగమం 55 కోట్ల మందికిపైగా భక్తులు పుణ్య స్నానాలు ఆచరించినట్లు యూపీ సర్కార్‌ ప్రకటించింది. ప్రపంచంలోనే ఇంత మంది భక్తులు పాల్గొన్న మొదటి కార్యక్రమంగా కుంభమేళా రికార్డు సృష్టించింది.

జనవరి 13వ తేదీన మహాకుంభమేళా ప్రారంభమైంది. ఫిబ్రవరి 26 శివరాత్రి వరకూ ఈ కుంభమేళా కొనసాగనుంది. దాదాపు 45 రోజులపాటూ జరిగే ఈ మహా కుంభమేళాకు ప్రపంచం నలుమూలల నుంచి దాదాపు 50 కోట్ల మంది భక్తులు వస్తారని యూపీ ప్రభుత్వం ముందుగానే అంచనా వేసింది. అయితే, అంచనాలకు మించి భక్తులు తరలివస్తున్నారు.

మహా కుంభమేళాలో మళ్ళీ భారీగా భక్తులు తరలివచ్చారు. సాయంత్రం 4 గంటల సమయానికి కోటి 80లక్షల మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు ప్రయాగ్‌రాజ్‌లోని 7 ఎంట్రీ పాయింట్లన్నీ స్తంభించిపోయాయి. మహా కుంభమేళాలో పాల్గొనే అధికారుల విధులను ఫిబ్రవరి 27 వరకు పొడిగించారు.ముఖ్యంగా దక్షిణాది నుండి ఈశాన్య రాష్ట్రాల నుండి భక్తులు అమృత స్నానం కోసం భారీగా తరలివస్తున్నారు.

పుణ్యస్నానాల అనంతరం భక్తులు అట్నుంచి అటు అయోధ్య బాట పడుతున్నారు. అయోధ్యలో కొలువుదీరిన బాల రాముడిని దర్శించుకుంటున్నారు. గత కొన్ని రోజులుగా అయోధ్యకు భక్తుల రద్దీ పెరిగినట్లు ఆలయ ట్రస్ట్‌ తెలిపింది. నిత్యం లక్షల్లో యాత్రికులు రామ్‌లల్లా దర్శనానికి వస్తున్నట్లు పేర్కొంది. భక్తులు రామ్‌ లల్లాతోపాటు హనుమాన్‌గర్హి ఆలయాన్ని సందర్శిస్తున్నట్లు తెలిపింది. ఇక భక్తులు అధిక సంఖ్యలో వస్తుండటంతో శ్రీరామ జన్మభూమి దర్శన మార్గ్‌ రద్దీగా మారింది. భక్తుల రద్దీ నేపథ్యంలో ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button