దీపావళి తర్వాత ఢిల్లీని కమ్మేసిన దట్టమైన పొగమంచు

దీపావళి పండగ ముగిసి రెండు రోజులు గడిచినా, దాని ప్రభావం దేశ రాజధాని ఢిల్లీని ఇంకా వీడలేదు. నగరాన్ని దట్టమైన పొగమంచు కప్పేయడంతో ప్రజలు ఊపిరి పీల్చుకోవడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరడంతో ఢిల్లీ గాలి నాణ్యత నేడు ‘చాలా ప్రమాదకరం’ కేటగిరీకి పడిపోయింది.
కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి వెల్లడించిన వివరాల ప్రకారం, నగరం సగటు వాయు నాణ్యత సూచీ 345గా నమోదైంది. అశోక్ విహార్, బవానా, దిల్షాద్ గార్డెన్ వంటి ప్రాంతాల్లో ఏక్యూఐ 380కి చేరి పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది. డీటీయూ, ఐజీఐ ఎయిర్పోర్ట్, లోధీ రోడ్ వంటి కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఏక్యూఐ 300 లోపు ఉండి ‘ప్రమాదకరం’ కేటగిరీలో ఉంది.ఈ నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. భారత వాతావరణ శాఖ , ఐఐటీఎం అంచనాల మేరకు ఢిల్లీ-ఎన్సీఆర్ పరిధిలో గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ రెండో దశను అమలులోకి తెచ్చారు.
ఢిల్లీ కాలుష్యానికి కేవలం బాణసంచా మాత్రమే కారణం కాదని, ఇతర అంశాలు కూడా దోహదపడుతున్నాయని నివేదికలు చెబుతున్నాయి. కాలుష్యంలో వాహనాల నుంచి వెలువడిన పొగ వాటా 15.6 శాతం కాగా, పరిశ్రమలు, ఇతర వనరుల వాటా 23.3శాతంగా ఉందని డెసిషన్ సపోర్ట్ సిస్టమ్ (డీఎస్ఎస్) తెలిపింది.ఈ కాలుష్యం వల్ల శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, కళ్ల మంటలు వంటి ఆరోగ్య సమస్యలు ఎదురవుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.



