తెలంగాణ

ఇంటిని రాయించుకొని.. తండ్రిని గెంటేసిన కూతురు

Asif Nagar: కనిపెంచిన కుమార్తె తన తండ్రిని ఇంటిలోకి రాకుండా అడ్డుకుంది. ఈ సంఘటన ఆసిఫ్‏నగర్‌ పోలీస్‏స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. మురాద్‌నగర్‌కు చెందిన సయ్యద్‌ అహ్మద్‌అలీకి ముగ్గురు కుమార్తెలు. ఆస్తిని ముగ్గురికి సమానంగా పంచారు. ఆస్తి తీసుకున్న తర్వాత చిన్న కుమార్తె ఇస్రా అహ్మద్‌ తనను సరిగా చూసుకోవడం లేదని ఆరోపిస్తూ పేరెంట్స్‌ అండ్‌ సీనియర్‌ సిటిజన్స్‌ యాక్ట్‌-2007 కింద కలెక్టరేట్‌లో సయ్యద్‌ అహ్మద్‌అలీ కొన్ని నెలల క్రితం ఫిర్యాదు చేశారు.

అలాగే హైకోర్టులో కూడా పిటిషన్‌ దాఖలు చేశారు. దీంతో 2023లో అప్పటి కలెక్టర్‌ అనుదీప్‌ ఆదేశాలు జారీ చేస్తూ అహ్మద్‌అలీకి ఆశ్రయం కల్పించాలని కుమార్తెకు సూచించారు. అయినప్పటికీ ఆమె తన తండ్రిని రానీయకపోవడంతో అహ్మద్‌అలీ కలెక్టర్‌ హరిచందనను కలిసి తన గోడును వినిపించుకున్నాడు. దీంతో కుమార్తె ఉన్న ఇంటిని ఇల్లు ఖాళీ చేసి సయ్యద్‌ అహ్మద్‌కు అప్పగించాలంటూ స్థానిక తహసీల్దార్‌ జ్యోతికి ఆమె ఆదేశాలు జారీ చేశారు.

బాధితుడితో కలిసి తహసీల్దార్‌ జ్యోతి మురాద్‌నగర్‌లోని అపార్ట్‌మెంట్‌కు వెళ్లారు. తండ్రిని లోపలికి రాకుండా కుమార్తె అడ్డుకుంది. ఇంటి బయట తాళం వేయడంతో ఇద్దరి నడుమ వాగ్వాదం చోటుచేసుకుంది. ఇరువురి నడుమ వాదులాటతోపాటు లోపలికి వెళ్లకుండా కుమార్తె హైడ్రామా చేసింది. దీంతో తహసీల్దార్‌ ఆసి‌ఫ్‌నగర్‌ పోలీసులను రప్పించారు. ఆ తర్వాత బలవంతంగా తాళం పగులగొట్టి ఇంటి హ్యాండోవర్‌ పత్రాన్ని సయ్యద్‌ అహ్మద్‌కు అప్పగించారు. అనంతరం సయ్యద్‌ అహ్మద్‌ మాట్లాడుతూ న్యాయం చేసిన అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button