తెలంగాణ కాంగ్రెస్ కొట్లాటపై హైకమాండ్ సీరియస్!

Telangana: తెలంగాణ కాంగ్రెస్లో ఏం జరుగుతోంది. రేవంత్ రెడ్డి సర్కార్లో ఏం జరుగుతోంది. మాకు తెలియాలి అంటోంది ఢిల్లీలోని కాంగ్రెస్ హైకమాండ్. కేబినెట్పై అవినీతి ఆరోపణలు, మంత్రుల పరస్పర విమర్శలు, పొలిటికల్ రచ్చలో సీఎం రేవంత్ సహా మంత్రుల కుటుంబ సభ్యుల జోక్యం ఆరోపణలపై కాంగ్రెస్ హైకమాండ్ సీరియస్ అయినట్లు తెలుస్తోంది. సర్కార్ సారథి రేవంత్ రెడ్డి, పార్టీ సారధి మహేష్ కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సీనియర్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇతర సీనియర్ నేతలను ఢిల్లీకి పిలిపించిన అధిష్టానం కాంగ్రెస్ కొట్లాటపై వివరణ తీసుకునే అవకాశముందనే పొలిటికల్ లీకులు వస్తున్నాయి.
అటవీశాఖ టెండర్లతో మొదలైన మంత్రుల పంచాయితీపై విపక్షాలు రాష్ట్రంలో గన్ కల్చర్ విస్తరించిందనే విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ వ్యవహారంలో మంత్రి కొండా సురేఖ వర్సెస్ పొంగులేటి ఇష్యూలో ఆఫ్ ది రికార్డ్గా సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు, అనుచరుల పేర్లు, ఉత్తమ్ కుమార్ రెడ్డి నియోజకవర్గంలో జరిగిన గొడవపై ఆయన నోరు విప్పాలనే డిమాండ్స్ వస్తున్నాయి. ఐఏఎస్ అధికారి రిజ్వీ రాజీనామా వ్యవహారంలో సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యుల పేర్లు, మంత్రి జూపల్లి కుటుంబ సభ్యుల పేర్లు తెరపైకి వచ్చి పొలిటికల్ దుమారం చెలరేగుతోంది.
అంతకుముందు మంత్రి పొన్నం ప్రభాకర్ వర్సెస్ అడ్లూరీ లక్ష్మణ్, మినిస్టర్లు వివేక్- లక్ష్మణ్ మధ్య సామాజికవర్గాల చిన్నచూపు ఇష్యూ, జూనియర్ సీనియర్ వార్ కాంగ్రెస్ను బద్నామ్ చేసింది. ఇలా పాలన పరంగా, పార్టీ పరంగా, సామాజిక వర్గాల పరంగా అంతర్గత సంఘర్షణలపై హైకమాండ్ ఫోకస్ చేసినట్లు తెలిసింది. రాష్ట్రంలో పెద్దరికం చేస్తున్న నేతలను పిలిచి మాట్లాడి మందలించే అవకాశముందనే టాక్ వస్తోంది.



