మేడారం జాతర పోస్టర్ ఆవిష్కరించిన సీఎం రేవంత్

Revanth Reddy: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన మంత్రులు కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస రెడ్డి మేడారం సమ్మక్క సారక్క జాతరకు రావాలని ఆహ్వానించారు. సీఎం రేవంత్.. మంత్రులు, అధికారులు, అర్చకులతో కలిసి మేడారం మహా జాతర పోస్టర్ ఆవిష్కరించారు. గిరిజన మహా జాతరను కనీవిని ఎరుగని రీతిని ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. దేశ విదేశాల నుంచి లక్షలాదిమంది భక్తులు మేడారం సమ్మక్క సారక్కను దర్శించుకునేందుకు వస్తుంటారు.
వారికి ఏర్పాట్లు కల్పించేందుకు, శాశ్వత వసతులు కల్పించేందుకు ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన పనులు చేయిస్తోంది. ఇప్పటికే అమ్మవార్లను దర్శించుకునేందుకు వేలాది మంది భక్తులు మేడారం వెళ్తున్నారు. మహా జాతరకు ముందే కొద్దిమంది మేడారం సందర్శిస్తుంటారు. మేడారం వెళ్లేకంటే ముందు వేములవాడ రాజరాజేశ్వరస్వామిని, కొమురవెల్లి మల్లన్నను, ఓదెల మల్లన్నను, ఐనవోలును దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారు. మరికొంతమంది స్థానికంగా నిర్వహించే సమ్మక్క సారక్క జాతరలు చేసుకుని మేడారం మహా జాతరకు బయల్దేరుతారు.



