అమెరికాలో ఘోర విమాన ప్రమాదం.. ముగ్గురు మృతి

అమెరికాలో ఘోర విమాన ప్రమాదం సంభవించింది. లూయిస్విల్లే నగరంలో టేకాఫ్ తీసుకుంటున్న సమయంలో ఓ కార్గో విమానం కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మరణించగా, మరో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదాన్ని అమెరికా ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ అధికారికంగా ధ్రువీకరించింది.
వివరాల్లోకి వెళితే యూపీఎస్కు చెందిన ఫ్లైట్ నంబర్ 2976 కార్గో విమానం లూయిస్విల్లే నుంచి హోనులులుకు బయలుదేరింది. టేకాఫ్ అవుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. గాల్లోకి ఎగురుతున్న సమయంలో విమానంలో ఒక్కసారిగా మంటలు చెలరేగి, అదుపుతప్పి కిందకు పడిపోయింది.
మెక్డోనెల్ డగ్లస్ ఎండీ-11 రకానికి చెందిన ఈ విమానం పూర్తిగా దగ్ధమైంది. విమానం గాల్లో ఉండగానే మంటల్లో చిక్కుకుని కూలిపోతున్న వీడియోలు పలువురిని కలచివేస్తున్నాయి. ప్రమాద సమాచారం అందిన వెంటనే సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించాయి.



