BRS: ఉద్యోగుల సమస్యలపై బీఆర్ఎస్ పోరుబాట

BRS: ఉద్యోగుల సమస్యలపై పోరుబాటకు బీఆర్ఎస్ సిద్ధమవుతోంది. ఉద్యమ కాలంలో పనిచేసిన ఉద్యోగ నేతలపై దృష్టి సారిస్తోంది. ప్రభుత్వంపై, ఉద్యోగుల సమస్యలపై గళం విప్పుతున్న వారికి అండగా నిలబడాలని భావిస్తోంది. ఉద్యమం నాటి స్పూర్తిని రగిల్చే ప్రణాళికలను గులాబీ పార్టీ రూపొందిస్తుంది. మరి బీఆర్ఎస్ పోరాటంతో రేవంత్ సర్కార్ దిగి వస్తుందా..? ఉద్యోగుల సమస్యలు పరిష్కారమవుతాయా..? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ..
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ప్రభుతాన్ని నిలదీసేందుకు ఉద్యోగ సంఘాలు ఉద్యమ కార్యాచరణకు సిద్ధమవుతున్నాయి. ప్రభుత్వానికి డెడ్ లైన్ సైతం విధించాయి. ఉద్యోగుల సమస్యలపై ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీ ఏర్పడి 7 నెలలు అవుతున్నా ఒక్క సమావేశం నిర్వహించలేదని 5 కరువు భత్యాలను ప్రకటించలేదని ఉద్యోగులు మండిపడుతున్నారు.
కరువు భత్యాలను విడుదల చేయాలని, 10వేల కోట్ల పెండింగ్ బిల్స్ను క్లియర్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. పొదుపు చేసిన డబ్బులను అవసరమైనప్పుడు ఇవ్వడం లేదని 15 రోజుల్లో బిల్స్ క్లియర్ చేస్తామని ప్రభుత్వం ప్రకటించినా, చేయడం లేదంటున్నారు. ఏప్రిల్ నుంచి 650కోట్లు కేటాయించి 16 నెలల్లోగా పెండింగ్ బిల్స్ క్లియర్ చేస్తామని చెప్పిన ప్రభుత్వం.. ఐదుకోట్లను కూడా కేటాయించలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కరువు భత్యాలను కలుపుకొని 51శాతం ఫిట్మెంట్తో వేతన సవరణను ప్రకటించాలని సాధారణ బదిలీలు నిర్వహించాలని ఉద్యోగ సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. సీపీఎస్ను రద్దు చేయాలని, స్థానికత ప్రాతిపదికన అదనపు పోస్టులు సృష్టించి 317 జీవో అమలు చేయాలని కోరుతున్నారు. వేతన సవరణ కోసం ఏర్పాటు చేసిన శివ శంకర్ కమిటీ గడువు పూర్తయినా ప్రభుత్వం నివేదిక తెప్పించుకోలేదని మండిపడుతున్నారు.
ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా పెన్ డౌన్, సామూహిక సెలవులకు సిద్ధమవుతున్నారు. వీటిని అనువుగా మలుచుకోవడానికి బీఆర్ఎస్ సిద్ధమవుతోంది. ఉద్యోగస్తులను బీఆర్ఎస్ పార్టీ తమవైపు తిప్పుకునేందుకు ప్లాన్ వేస్తోంది. అందులో భాగంగా నాడు తెలంగాణ ఉద్యమ సమయంలో కీలకంగా వ్యవహరించిన స్వామిగౌడ్, దేవీ ప్రసాద్, శ్రీనివాస్ గౌడ్లతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు కేటీఆర్.
గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉద్యోగుల సంక్షేమం కోసం తీసుకున్న నిర్ణయాలు ఉద్యోగులకు తెలియజేయాలని గులాబీ పార్టీ భావిస్తోంది. అందులో భాగంగానే ఉద్యోగులకు తమ ప్రభుత్వ హయాంలో ఇచ్చిన 73 శాతం ఫిట్మెంట్ను గుర్తు చేసేందుకు సిద్ధం అవుతున్నారు. ఉద్యోగాల కల్పన, ఈహెచ్ఎస్, సాధారణ బదిలీలు చేసిన అంశాన్ని మరోసారి ఉద్యోగులకు వివరించాలని బీఆర్ఎస్ భావిస్తోంది.
ఉద్యోగ సంఘాలు చేపట్టే కార్యక్రమాలకు మద్దతు ఇవ్వాలని నిర్ణయించింది. గతంలో బీఆర్ఎస్పై ఉద్యోగుల్లో వ్యతిరేకత ఉన్నట్లు కొందరు పని గట్టుకొని ప్రచారం చేశారని బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. ఫ్రెండ్లీ గవర్నమెంట్ నిర్వహించి సమస్యలను పరిష్కరించామని దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా వేతనాలు పెంచామనే విషయాన్ని మరోసారి ఉద్యోగులకు వివరించేందుకు సిద్ధమవుతోంది.
ఉద్యమకాలంలో రాష్ట్ర సాధన కోసం అన్ని సంఘాలు ఏకతాటిపైకి వచ్చాయి. జేఏసీగా ఏర్పడి ఉద్యమబాట పట్టాయి. ఉద్యోగ సంఘాల నేతలు నిరసనలతో హోరెత్తించారు. ఐక్యంగా రాష్ట్రాన్ని సాధించడంలో కీలక భూమిక పోషించారు. ఇప్పుడు కూడా అదే విధంగా ప్రభుత్వంపై పోరాటం చేసి డిమాండ్లు సాధించేలా వారిలో చైతన్యం తేవాలని బీఆర్ఎస్ భావిస్తోంది.
వారికి అండగా ఉండేందుకు గులాబీ పార్టీ సిద్ధమవుతుంది. అంతేగాకుండా నాడు ఉద్యమసమయంలో పనిచేసిన యాక్టివ్ నేతలకు బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన కీలక పదవులను సైతం వివరించనుంది. వారితోనే ఉద్యోగ సమస్యలపై మాట్లాడించాలని.. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని ప్రణాళికలు రచిస్తోంది.
మొత్తానికి మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టబోతోంది బీఆర్ఎస్. ఓ వైపు ప్రజాసమస్యలపై, మరోవైపు ఉద్యోగుల సమస్యలపై పోరుబాటకు ప్రణాళికలు రూపొందిస్తోంది. త్వరలోనే కేసీఆర్తో భేటీ కానున్నారు ఉద్యోగ సంఘాల నాయకులు. మరి.. బీఆర్ఎస్ పోరాటం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తుందా…! ఉద్యోగుల సమస్యలు తీరుతాయా…! వేచి చూడాల్సిందే.