అంతర్జాతీయం

Russia vs Ukraine: రష్యాపై ఉక్రెయిన్ భీకర దాడి.. 41 యుద్ధ విమానాలు ధ్వంసం

Russia-Ukraine: శాంతి చర్చల నేపథ్యంలో నివురుగప్పిన నిప్పులా ఉన్న రష్యా, ఉక్రెయిన్‌ యుద్ధం ఆదివారం తీవ్రరూపం దాల్చింది. రష్యాలోని వైమానిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఉక్రెయిన్‌ విరుచుకుపడగా ఉక్రెయిన్‌లోని సైనిక శిక్షణ కేంద్రంపై రష్యా దాడి చేసింది. 472 డ్రోన్లను ఆ దేశంపైకి ప్రయోగించింది. ఈ దాడుల్లో రెండు దేశాలు తీవ్రంగా నష్టపోయాయి. రష్యాకు చెందిన 41 యుద్ధ విమానాలు ధ్వంసం కాగా ఉక్రెయిన్‌కు చెందిన 12 మంది సైనికులు మరణించారు.

రష్యా దాడిలో 12 మంది ఉక్రెయిన్ సైనికులు మరణించగా మరో 60 మంది తీవ్రంగా గాయపడ్డట్టు ఉక్రెయిన్ గ్రౌండ్ ఫోర్సెస్ తెలిపింది. అయితే అటాక్ టైంలో అక్కడ సైనిక కవాతు జరగలేదని అంతేగాక జవాన్లు అక్కడ గుమిగూడలేదని పేర్కొంది. ఇరు దేశాల మధ్య యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి రష్యా అతి పెద్ద డ్రోన్ దాడి నిర్వహించడం ఇదే తొలిసారి.

రష్యా దాడులకు ప్రతీకారంగా ఉక్రెయిన్ సైతం రష్యాపై అటాక్ చేసింది. సైబీరియాతో పాటు ఇతర వైమానిక స్థావరాలపై భారీ డ్రోన్ దాడులకు పాల్పడింది. ముర్మాన్స్క్‌లోని ఒలెన్యా ఎయిర్ బేస్, ఇవనోవోలోని ఇవనోవో, డయాగిలేవో ఎయిర్ బేస్‌లను లక్ష్యంగా చేసుకున్నట్టు ఆఫ్ ఉక్రెయిన్ తెలిపింది. ఈ దాడుల్లో 40 రష్యాన్ యుద్ధ విమానాలు ధ్వంసమైనట్టు వెల్లడించింది.

ఇందులో టీయూ-95, టీయూ-22 వంటి బాంబర్లు సైతం ఉన్నాయి. అయితే దీనిని రష్యా అధికారికంగా ధ్రువీకరించలేదు. అయితే సైబీరియాలోని ఇర్కుట్స్క్ ప్రాంతంలో తమ సైనిక స్థావరంపై డ్రోన్ దాడి జరిగినట్టు ఆ ప్రాంత గవర్నర్ తెలిపారు. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి సైబీరియాలో దాడి జరగడం కూడా ఇదే మొదటిసారి.

రష్యా, ఉక్రెయిన్‌ మధ్య ఇవాళ తుర్కియేలోని ఇస్తాంబుల్‌లో శాంతి చర్చలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్‌ భారీ దాడులు చేయడం కలకలం రేపింది. ఆదివారం రష్యాలోని వైమానిక స్థావరాలపై దాడిని అధ్యక్షుడు జెలెన్‌స్కీ స్వయంగా పర్యవేక్షించారు. ఈ దాడులకు ఏడాదిన్నర నుంచి ఆ దేశం ప్రణాళిక రచించినట్లు తెలిసింది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button