అంతర్జాతీయం
Congo: రాగి గనిలో కుప్పకూలిన వంతెన.. 32 మంది మృతి

Congo: ఆఫ్రికా దేశమైన కాంగోలో ఘోర ప్రమాదం జరిగింది. రాగి గనిలో వంతెన కుప్పకూలింది. దీంతో 32 మంది మృతి చెందారు. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఆగ్నేయ కాంగోలోని లుఅలాబా ప్రావిన్స్లో ఉన్న కలాండో రాగి గని వద్ద వంతెన కూలిపోవడంతో ఈ విషాదం జరిగింది. గని దగ్గర భద్రత కోసం ఉన్న సైనికులు గాల్లోకి కాల్పులు జరపడంతో కార్మికులు భయంతో పరుగులు తీసి, ఇరుకైన వంతెనపై ఎక్కువ సంఖ్యలో ఒకేసారి చేరడంతో అది బరువును తట్టుకోలేక కూలిపోయింది.
దీంతో ప్రజలు ఒకరిపై ఒకరు పడిపోవడంతో ఊపిరాడక, తొక్కిసలాటలో మరణాలు సంభవించినట్లు అధికారులు తెలిపారు. మృతుల సంఖ్య పై ఇంకా స్పష్టత రాకపోయినా, అది 49కి చేరే అవకాశం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ ఘటనపై సైన్యం పాత్రపై స్వతంత్ర విచారణ చేపట్టాలని మానవ హక్కుల సంస్థలు డిమాండ్ చేస్తుండగా, ప్రమాద స్థలంలో రక్షణ చర్యలు కొనసాగుతున్నాయి.



