జాతియం

ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ కేసులో మరో డాక్టర్ ఆరిఫ్ అరెస్ట్

దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట వద్ద జరిగిన కారు బాంబు పేలుడు కేసు విచారణలో కీలక పురోగతి చోటుచేసుకుంది. ఉత్తరప్రదేశ్ ఏటీఎస్, ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్, జమ్మూకశ్మీర్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో కాన్పూర్‌లోని కార్డియాలజీ ఇనిస్టిట్యూట్ నుంచి డాక్టర్ మహమ్మద్ ఆరిఫ్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో గత వారం అరెస్టైన లక్నోకు చెందిన మహిళా డాక్టర్ షాహీన్‌తో ఆరిఫ్ నిరంతరం టచ్‌లో ఉన్నట్లు దర్యాప్తు సంస్థలు గుర్తించాయి.

డాక్టర్ షాహీన్ ఫోన్ రికార్డులను పరిశీలించినప్పుడు ఆరిఫ్ పేరు వెలుగులోకి వచ్చింది. జమ్మూకశ్మీర్‌లోని అనంతనాగ్‌కు చెందిన ఆరిఫ్ నీట్-ఎస్ఎస్ 2024 బ్యాచ్ విద్యార్థి. ఫరీదాబాద్‌లోని అల్-ఫలా యూనివర్సిటీలో అతను విద్యనభ్యసించినట్లు తెలిసింది.

గత వారం అరెస్టయిన డాక్టర్ షాహీన్ షాహిద్ ఎర్రకోట పేలుడు, ఫరీదాబాద్ టెర్రర్ మాడ్యూల్‌కు మధ్య కీలక వ్యక్తిగా, ప్రధాన అనుసంధానకర్తగా ఉన్నట్లు ఏజెన్సీలు అనుమానిస్తున్నాయి. జైష్-ఎ-మహమ్మద్ , అన్సార్ గజ్వత్-ఉల్-హింద్ అనే రెండు ఉగ్రవాద సంస్థలతో సంబంధం ఉన్న ఫరీదాబాద్ మాడ్యూల్‌ను జమ్మూకశ్మీర్ పోలీసులు ఛేదించారు. ఈ క్రమంలోనే ఫరీదాబాద్‌లోని ధౌజ్ గ్రామంలో అద్దెకు తీసుకున్న ప్రాంగణంలో భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకుని, డాక్టర్ ముజమ్మిల్ అహ్మద్ గనాయ్‌ను అధికారులు అరెస్ట్ చేశారు.

మరోవైపు, కశ్మీర్‌కు చెందిన మరో డాక్టర్ నిసార్-ఉల్-హసన్ పేలుడు జరిగిన రోజు నుంచి కనిపించకుండా పోయాడు. ఉగ్రవాద సంస్థలతో సంబంధాలున్నాయనే ఆరోపణలతో జమ్మూకశ్మీర్ ప్రభుత్వం అతడిని ఉద్యోగం నుంచి తొలగించగా, ఆ తర్వాత అల్-ఫలా యూనివర్సిటీ అతడిని నియమించుకుంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button