అనోఖీలాల్: మూడుసార్లు ఉరిశిక్ష పడి, 11 ఏళ్లు జైల్లో ఉండి నిర్దోషిగా విడుదలైన బాధితుడు

తొమ్మిదేళ్ల బాలికపై అత్యాచారం, హత్య కేసులో 21 ఏళ్ల యువకుడికి మధ్యప్రదేశ్లోని ఒక ట్రయల్ కోర్టు 2013లో ఉరిశిక్ష విధించింది.
ఘటన జరిగిన నెల రోజుల తర్వాత నిందితుడికి ఈ శిక్ష పడింది. ఇదే కాకుండా మరో రెండు కోర్టులు కూడా ఆయనకు మరణశిక్ష విధించాయి.
ఈ కేసులో సాక్ష్యాలను తప్పుగా విశ్లేషించారంటూ మరో ట్రయల్ కోర్టు ఈ ఏడాది మార్చిలో ఆయనను నిర్దోషిగా విడుదల చేసింది.
ఈ కేసు గురించి బాధితుడితో, ఆయన కుటుంబీకులతో మాట్లాడేందుకు బీబీసీ ప్రతినిధి ఉమంగ్ పొద్దార్, మధ్యప్రదేశ్కు వెళ్లారు.
అనోఖీలాల్ 11 ఏళ్ల తర్వాత ఇంటికి వచ్చారు. ఆయనకు స్వాగతం పలికేందుకు వారి బంధువులు తరలివచ్చారు. కానీ, అనోఖీలాల్ మాతృభాషను మర్చిపోవడం, తమలో చాలామందిని గుర్తుపట్టకపోవడం వారిని ఆశ్చర్యపరిచింది.
”ఈ 11 ఏళ్లలో నేను చాలా విషయాలను మర్చిపోయా” అని ఆయన చెప్పారు.
తొమ్మిదేళ్ల బాలికపై అత్యాచారం, హత్య అనే ఆరోపణలపై అనోఖీలాల్ దాదాపు 11 ఏళ్లు, అంటే 4,033 రోజులు శిక్షను అనుభవించారు. ఈ కేసు విచారణ అయిదు దఫాలుగా జరిగింది. ఆరోసారి విచారణ సందర్భంగా ట్రయల్ కోర్టు ఆయనను నిర్దోషిగా విడుదల చేసింది.
దశాబ్దం తర్వాత శిక్షను ఎత్తివేసేలా ఏం జరిగింది? నిందితుడిపై, బాధితుల కుటుంబీకులపై ఈ అస్తవ్యస్త న్యాయ ప్రక్రియ ఎలాంటి ప్రభావం చూపించింది?
అసలు ఏం జరిగింది?
2013 జనవరిలో మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఓ ఇంటి నుంచి ఒక తొమ్మిదేళ్ల బాలిక కనిపించకుండా పోయింది. తమ కూతురు కనిపించడం లేదంటూ ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
తమ గ్రామంలోని ఒక పాలకొట్టులో పనిచేసే 21 ఏళ్ల అనోఖీలాల్తో చివరిసారిగా తమ కూతురు కనిపించిందని ఫిర్యాదులో వారు పేర్కొన్నారు. గ్రామానికి చెందిన మరో వ్యక్తి కూడా కోర్టులో ఇదే విషయాన్ని చెప్పారు.
అయితే, ఈ ఘటన జరిగినప్పుడు తాను ఊళ్లో లేనని అనోఖీలాల్ వాదించారు.
రెండు రోజుల తర్వాత బాలిక మృతదేహాన్ని కుటుంబీకులు గుర్తించారు. బాలికపై అత్యాచారం చేసి హత్యచేసినట్లు శవపరీక్షలో తెలిసింది. ఈ కేసులో అనోఖీలాల్ను ప్రధాన నిందితుడిగా చేర్చి వెంటనే అరెస్ట్ చేశారు.
ఈ వార్త వెంటనే అంతటా పాకింది. ”ఈ ఘటన ప్రజలకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. పోలీస్, న్యాయవ్యవస్థపై ఒత్తిడి పెంచింది” అని ఈ ఘటనను కవర్ చేసిన జర్నలిస్ట్ జై నగడా చెప్పారు.
2012లో న్యూదిల్లీలో 23 ఏళ్ల వైద్య విద్యార్థినిపై జరిగిన దారుణ అత్యాచారం, హత్య.. దేశమంతటా ఆగ్రహావేశాలను రేకెత్తించింది. ఈ దారుణ ఘటన జరిగిన కొన్నిరోజులకే మధ్యప్రదేశ్లో బాలిక హత్యాచార ఉదంతం బయటకు రావడంతో సామూహిక నిరసనలు, కొవ్వొత్తుల ప్రదర్శనలు జరిగాయి. బాధితులకు సత్వర న్యాయం జరగాలని, రేపిస్టులకు కఠిన శిక్ష విధించాలంటూ డిమాండ్లు వెల్లువెత్తాయి.
అనోఖీలాల్ కేసు విచారణ అత్యంత వేగంగా జరగడానికి ఇదొక కారణం కావొచ్చని నాతో మాట్లాడిన పలువురు జర్నలిస్టులు అభిప్రాయపడ్డారు.
తొమ్మిది రోజుల్లోనే పోలీసులు ఈ కేసు దర్యాప్తు పూర్తి చేశారు. వెంటనే కోర్టు విచారణ మొదలైంది. రెండు వారాల్లోనే ఆయనకు ఉరిశిక్ష పడింది. ఇలాంటి వ్యక్తి సమాజానికి ప్రమాదరకరమని, శాపమని ట్రయల్ కోర్టు వ్యాఖ్యానించింది.
ఇదంతా చాలా వేగంగా జరిగిపోయింది. ”నాకు గానీ, నా కుటుంబీకులకు గానీ, మా లాయర్కు గానీ ఏం జరుగుతుందో అర్థం చేసుకునే సమయం కూడా ఇవ్వలేదు” అని అనోఖీలాల్ అన్నారు.
అనోఖీలాల్ది నిరుపేద కుటుంబం. గిరిజన కమ్యూనిటీకి చెందిన వ్యక్తి ఆయన. అనోఖీలాల్కు ఒక లాయర్ను కేటాయించారు. విచారణ మొదలైనప్పుడు తొలిసారి ఆయన లాయర్ను కలిశారు.
అప్పట్లో విచారణ ఎలా జరిగిందని నేను అడిగినప్పుడు, అసలేం జరుగుతుందో తనకేం అర్థం కాలేదని అనోఖీలాల్ చెప్పారు.
”నేను ఎప్పుడూ స్కూలుకు వెళ్లలేదు. 10 ఏళ్ల పిల్లాడిగా ఉన్నప్పటి నుంచే పని చేస్తున్నా. ఉరిశిక్ష గురించి తెలియగానే నా ఒళ్లంతా వణికింది. నోట మాట రాలేదు. విషయం అర్థం కావడానికి చాలా సమయం పట్టింది” అని అనోఖీలాల్ అన్నారు.
ఈ కేసులో ప్రత్యక్ష సాక్షులు లేనందున డీఎన్ఏ, ఇతర సాక్ష్యాలపై మాత్రమే ఆధారపడాల్సి ఉన్నందున ఇది చాలా కష్టమైన కేసని ఆ సమయంలో పోలీసులు పేర్కొన్నారు.
అయితే, మెరుపు వేగంతో విచారణ జరిపిన తీరు పట్ల పలువురు న్యాయ నిపుణులు సందేహాలు లేవనెత్తారు. న్యాయ విచారణలో తప్పిదం జరిగే అవకాశం ఉండొచ్చని పేర్కొన్నారు.
”ఈ తీర్పు పతాక శీర్షికలకు ఎక్కింది. కానీ, ఈ కేసులో నిజంగా న్యాయం జరిగిందా?” అంటూ ఒక లాయర్ను ఉటంకిస్తూ ఒక నివేదికను నాకు జై నగడా చూపించారు.
11 ఏళ్ల తర్వాత, ఈ నివేదికలు నిజమని రుజువయ్యాయి.
సుదీర్ఘ విచారణ
ఈ కేసు విచారణ పలు దఫాలుగా దేశంలోని చాలా కోర్టుల్లో జరిగింది. అతనికి విధించిన శిక్షను 2013లో హైకోర్టు సమర్థించింది.
తర్వాత కొన్ని నెలల పాటు తాను డిప్రెషన్లో ఉన్నట్లు అనోఖీలాల్ చెప్పారు.
”సరిగ్గా తినలేకపోయాను. ఆత్మహత్య చేసుకుందామని నిర్ణయించుకున్నా. కానీ, కుదర లేదు. లేకపోతే నేను ఇప్పటికి చనిపోయి ఉండేవాడిని” అని ఆయన అన్నారు.
ఊహకందని విధంగా వేగంగా జరిగిన ఈ కేసు దర్యాప్తు, విచారణలో లోపాలు ఉన్నట్లు ఆరేళ్ల తర్వాత సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. అదే రోజున డిఫెన్స్ లాయర్లను నియమించారు. కేసును మళ్లీ మొదటి నుంచి విచారించాలని సుప్రీం కోర్టు ఆదేశించింది.
”ఈ తీర్పుతో నాలో కాస్త ఆశ పుట్టింది. జైల్లో కొంతమంది స్నేహితులు అయ్యారు. నాకు చాలా మద్దతు ఇచ్చారు” అని అనోఖీలాల్ చెప్పారు. తర్వాత ఆత్మహత్య ఆలోచనలు తగ్గుముఖం పట్టాయని తెలిపారు.
జీవితం మొత్తం వలస కార్మికుడిగా పనిచేసిన తాను, ఎక్కువ కాలం ఒకేచోట గడిపిన ప్రాంతం ఇందౌర్ జైలు అని ఆయన చెప్పారు. జైల్లోనే పదోతరగతి పూర్తి చేశానని అన్నారు.
”రోజూ చదివేవాడిని. వ్యాయామం, ప్రార్థన చేసేవాడిని. దీంతో కాస్త మనసు కుదుటపడింది” అని ఆయన చెప్పారు.
కానీ, అంతలోనే ఆయన సంతోషం ఆవిరైంది. తీర్పు వెల్లడించడానికి మూడేళ్ల సమయం తీసుకున్న ట్రయల్ కోర్టు మళ్లీ ఆయనకు మరణ శిక్ష వేసింది.
ఈ సమయంలోనే మరణశిక్ష కేసులపై ప్రత్యేక శ్రద్ధ వహించే రీసెర్చ్, అడ్వొకసీ ఆర్గనైజేషన్ ‘ప్రాజెక్ట్ 39-ఎ’ ఈ కేసును స్వీకరించింది.
”జైల్లో నన్ను కలవడానికి వచ్చిన మొదటి వ్యక్తులు వారే. అప్పటివరకు ఏ లాయర్ కూడా నన్ను కలవలేదు” అని అనోఖీలాల్ చెప్పారు.
వారు హైకోర్టులో అప్పీల్ చేశారు. డీఎన్ఏ నివేదికలో చాలా లోపాలు ఉన్నాయని, వివిధ కోర్టుల మీదుగా సాగిన ఈ కేసు పదేళ్ల ప్రయాణంలో వీటిని ఎవరూ గుర్తించలేదని అనోఖీలాల్ తరఫు లాయర్లు చెప్పారు.
ఏ పత్రాలను అనుసరించి నిపుణులు ఈ నివేదికను తయారు చేశారో వాటన్నింటినీ కోర్టుకు సమర్పించాలని, అలాగే కోర్టు విచారణకు కూడా వారు హాజరు కావాలని లాయర్లు కోరారు. హైకోర్టు కూడా దీనికి అంగీకరించింది. దీంతో ఈ కేసు తిరిగి 2013లో విచారణ జరిగిన ట్రయల్ కోర్టుకు చేరింది.
డీఎన్ఏ నివేదికను క్షుణ్ణంగా పరిశీలించడంతో ఈ కేసు స్వరూపం పూర్తిగా మారిపోయింది.
ఇక్కడ అత్యంత దిగ్భ్రాంతి కలిగించే అంశం ఏంటంటే, బాలిక ప్రైవేటు భాగాల్లో గుర్తించిన డీఎన్ఏ, అనోఖీలాల్ డీఎన్ఏ కాదు, అది వేరొక వ్యక్తిది. ఈ కేసులో ఒక పురుషుడి డీఎన్ఏను గుర్తించడంతో పాటు అనోఖీలాల్ను సూచించే ఇతర సాక్ష్యాలు ఉన్నందున ఇప్పటివరకు కోర్టులన్నీ అతనే దోషి అని తీర్పునిచ్చాయి.
కోర్టులో ప్రవేశపెట్టిన వెంట్రుకలు, దుస్తుల నుంచి సేకరించిన డీఎన్ఏపై ఆధారపడలేమని, వాటిని చాలా పేలవంగా నిర్వహించారని కోర్టు వ్యాఖ్యానించింది. సాక్ష్యాలు తారుమారు కాలేదని పోలీసులు నిరూపించాల్సిన పరిస్థితి వచ్చింది.
2013లో దోషిగా తీర్పునిచ్చిన అదే కోర్టు 11 ఏళ్ల తర్వాత ఆయన్ను నిర్దోషిగా విడుదల చేసింది.
బాధితులు
అనోఖీలాల్ జైలు నుంచి బయటకు వచ్చేసరికి అంతా మారిపోయింది.
కోర్టుకు వందలాది కిలోమీటర్ల దూరంలో నివసించే ఆయన తండ్రికి తన కొడుకు నిర్దోషిగా విడుదలయ్యారనే విషయం కూడా తెలియదు.
”ఒక వ్యక్తి నాకు ఫోన్ చేసి, అనోఖీలాల్ విడుదలయ్యాడని చెప్పారు. అప్పటివరకు నాకు ఈ విషయం తెలియదు” అని ఆయన తెలిపారు.
దేశంలోని పోలీస్ వ్యవస్థ, న్యాయ వ్యవస్థ, ఈ కేసుల గురించి మాట్లాడుతున్నప్పుడు ఆయన గొంతు బాధతో, ఆవేశంతో పూడుకుపోయింది. ఈ కేసుతో దేశంలోని న్యాయ వ్యవస్థపై నమ్మకం పోయిందని ఆయన అన్నారు.
”అందరి కోపాన్ని చల్లార్చడానికి అతనికి మరణశిక్ష వేశారు. తర్వాత విడిచిపెట్టారు. వ్యవస్థ మొత్తం పట్టింపు లేనివారితో నిండిపోయింది” అని ఆయన అన్నారు.
ఒక ప్రైవేటు లాయర్ని ముందే ఏర్పాటు చేసుకుని ఉండి ఉంటే పరిస్థితులు మరోలా ఉండేవని ఆయన అన్నారు.
”అసలు సమస్య ఏంటంటే మాది చాలా పేద కుటుంబం” అని అన్నారాయన.
11 ఏళ్ల తర్వాత కూడా ఆ ఘటన తనను ఇంకా వెంటాడుతోందని అనోఖీలాల్ తండ్రి అన్నారు.
”ఆమెకు ఇప్పుడు 21 ఏళ్లు వచ్చి ఉండేవి. తను నాకు పెద్ద కూతురులాంటిది. ఆమెను నేను మర్చిపోలేదు. వార్తల్లో అత్యాచారం లాంటివి చూసినప్పుడు బాధ కలుగుతుంది. అందుకే ఇప్పుడు నేను వార్తలు కూడా చూడట్లేదు” అని ఆయన వివరించారు.
మూల్యం
తనకు 11 ఏళ్ల పాటు మరణశిక్ష వేసిన మొత్తం వ్యవస్థను అనోఖీలాల్ నిలదీస్తున్నారు
”అక్కడ మీ జీవితం మొత్తం నాశనం అవుతుంది. తర్వాత మీకు న్యాయం జరుగుతుంది. ఒకవేళ నేను అప్పుడే ఆత్మహత్య చేసుకొని ఉంటే ఇప్పుడేం చేసేవారు. నేను నేరం చేసి, ఆత్మహత్య చేసుకున్నానని అందరూ అనుకునేవారు. సమాజం ఇప్పటికీ నన్ను నేరస్థుడనే అనుకుంటుంది. ఈ కేసు నా జీవితాన్ని నాశనం చేసింది” అని ఆయన అన్నారు.
”నా చిన్ననాటి స్నేహితులంతా జీవితంలో ముందుకు వెళ్లారు. తమకంటూ ఒక కుటుంబాన్ని ఏర్పాటు చేసుకున్నారు. వాళ్ల పిల్లలు కూడా పెరిగి పెద్దయ్యారు. ఇప్పుడు నేను మొదటి నుంచి నా జీవితాన్ని మొదలుపెట్టాలి. నేను కోల్పోయిన ఈ 11 ఏళ్ల కాలాన్ని ఎవరు తెచ్చిస్తారు?” అని ఆయన ప్రశ్నించారు.
ఈ కేసు అనోఖీలాల్నే కాకుండా ఆయన కుటుంబం మొత్తాన్ని తీవ్ర ఇబ్బందులకు గురి చేసింది.
పేదవారైన వాళ్లకు ఈ కేసు తర్వాత ఆర్థిక సమస్యలు మరింత పెరిగాయి.
”అనోఖీలాల్ను చూడటానికి వెళ్లినప్పుడు నేను రైల్వే ప్లాట్ఫారమ్ మీదే నిద్రపోయాను. హోటల్కు వెళ్లేంత డబ్బు నా దగ్గర లేదు” అని ఆయన సోదరుడు తేజ్రామ్ చెప్పారు.
ఈ కేసు కోసం న్యాయపరమైన ఖర్చులను భరించేందుకు తమ కుటుంబానికి ఉన్న భూమిలో సగం అమ్మేశారు.
రాన్రాను తమ ఆశలు సన్నగిల్లాయని అనోఖీలాల్ తల్లి రెమాబాయి అన్నారు.
”ఇక మా అబ్బాయిని ఉరి తీస్తారనే అనుకున్నా. మా ఆశలు చచ్చిపోయాయి” అని ఆమె చెప్పారు.
కుటుంబ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా తనను కలిసేందుకు జైలుకు రావొద్దని చెప్పేవాడినని అనోఖీలాల్ తెలిపారు.
డీఎన్ఏ నివేదిక లోపాలు ఎందుకు బయటకు రాలేదు
11 ఏళ్ల పాటు డీఎన్ఏ నివేదికలోని లోపాలు ఎందుకు బయటపడలేదు?
తాము జోక్యం చేసుకునేంత వరకు ఎవరూ కూడా ఫోరెన్సిక్ సాక్ష్యాలను నిశితంగా పరిశీలించలేదని ప్రాజెక్ట్ 39 ఎకు చెందిన శ్రేయా రస్తోగి అన్నారు. భారత్లో ఫోరెన్సిక్ సైన్స్పై అవగాహన చాలా తక్కువగా ఉందని రస్తోగి అభిప్రాయపడ్డారు.
డీఎన్ఏ సాక్ష్యాధారాలను కోర్టుకు, అవతలి వైపు లాయర్లకు వివరించడం కోసం కోర్టులో ప్రవేశపెట్టిన ప్రైమర్ను ఆమె మాకు చూపించారు.
ఈ కేసులో చాలా పొరపాట్లు జరిగాయని ఆమె భావిస్తున్నారు. పోలీసులు, ఫోరెన్సిక్ బృందం, చివరకు కోర్టుల దగ్గర కూడా పొరపాట్లు జరిగాయని ఆమె అంటున్నారు.
తన విషయంలో మీడియా ప్రవర్తించిన తీరును కూడా అనోఖీలాల్ తప్పుబట్టారు. ఈ కేసుకు సంబంధించిన ప్రతీ అంశాన్ని నిశితంగా కవర్ చేశారు. అంతా దీనిగురించే మాట్లాడుకునేలా పరిస్థితి ఏర్పడింది. న్యాయం కావాలని డిమాండ్ చేస్తూ రాజకీయ నాయకులు ఆ ఊరుకు వెళ్లడం మొదలుపెట్టారు.
”మొదటి నుంచి మీడియా నన్నొక నేరస్థుడిలా చిత్రీకరించింది” అని అనోఖీలాల్ అన్నారు.
అయితే, ఈకేసులో అనోఖీలాల్ కష్టాలు ఇంకా తీరినట్లు లేవు. ఆయన నిర్దోషిత్వానికి వ్యతిరేకంగా హైకోర్టులో అప్పీలు చేసినట్లు పోలీసులు బీబీసీకి చెప్పారు. అయితే, హైకోర్టు ఇంకా ఈ అప్పీలును స్వీకరించలేదని తెలిపారు.
అక్కడ అత్యాచారం, హత్య జరిగాయన్నదే నిజం. కానీ, ఈ నేరం చేసిందెవరు? ఈ కేసులో ఇరు వర్గాలు అనుభవించిన వేదనకు బాధ్యులు ఎవరు?