అంతర్జాతీయం

America: విద్యార్థి వీసాలకు అమెరికా గ్రీన్‌ సిగ్నల్

America: అమెరికాలో చదువుకోవడం చాలామంది భారతీయ విద్యార్థులకు ఒక కల. ఆ కల కోసం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటారు. అప్పులు చేసైనా కలను నెరవేర్చుకునేందుకు కష్ట పడతారు. అయితే.. అమెరికాలో విద్యార్థి వీసాల జారీలో కోతలు, ఇతర విధానపరమైన మార్పుల కారణంగా ఆ కలలు సవాళ్లుగా మారాయి. ఇప్పుడు విదేశీ విద్యార్థులకు ట్రంప్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. కానీ.. ఓ కొత్త షరతు పెట్టింది. ఇంతకీ ట్రంప్ పెట్టిన షరతు ఏంటి..? విదేశీ విద్యార్థులు దీనిపై ఎలా స్పందిస్తున్నారు..?

అమెరికాలో చదువుల కోసం ఎదురుచూస్తున్న విదేశీ విద్యార్థులకు అగ్రరాజ్యం గుడ్‌న్యూస్‌ చెప్పింది. ఇటీవల తాత్కాలికంగా నిలిపివేసిన విద్యార్థి వీసా ఇంటర్వ్యూల షెడ్యూలింగ్‌ను డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం మళ్లీ ప్రారంభించింది. అయితే, వీసా కోసం దరఖాస్తు చేసుకునే విద్యార్థుల వీసా దరఖాస్తులతో పాటు దరఖాస్తుదారుల సోషల్ మీడియా కార్యకలాపాలను తప్పనిసరిగా పరిశీలించనున్నట్లు అమెరికా విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. ఈ మేరకు నూతన మార్గదర్శకాలను విడుదల చేసింది.

ఈ ఏడాది మే నెలాఖరు నుంచి ప్రపంచవ్యాప్తంగా ఉన్న అమెరికా రాయబార కార్యాలయాలు, కాన్సులేట్‌లలో కొత్తగా విద్యార్థి వీసాలకు దరఖాస్తు చేసుకునేవారి ఇంటర్వ్యూల షెడ్యూలింగ్‌ను తాత్కాలికంగా నిలిపివేసింది. వీసా జారీ ప్రక్రియలో భాగంగా సోషల్ మీడియా ఖాతాల పరిశీలనకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నందునే ఈ విరామం తీసుకున్నామని అప్పట్లో విదేశాంగ శాఖ పేర్కొంది. తాజాగా ఈ సోషల్ మీడియా వెట్టింగ్‌ను తప్పనిసరి చేస్తూ వీసా అపాయింట్‌మెంట్ల ప్రక్రియను పునరుద్ధరించింది.

సోషల్ మీడియా వెట్టింగ్‌ అంటే వీసా కోసం దరఖాస్తు చేసుకున్న వ్యక్తులకు అనుమతి ఇవ్వవచ్చా లేదా అనే విషయాన్ని అంచనా వేయడానికి వారి ఆన్‌లైన్‌ కార్యకలాపాలను, ముఖ్యంగా సోషల్ మీడియా పోస్టులను అధికారులు క్షుణ్ణంగా తనిఖీ చేయడం. ఉదాహరణకు ఒక విద్యార్థి తన సోషల్ మీడియా ఖాతాలో పాలస్తీనా జెండాను పోస్ట్ చేసినట్లు గుర్తిస్తే, ఆ వ్యక్తిని మరింత లోతుగా పరిశీలిస్తారు.

వారి వల్ల అమెరికా దేశ భద్రతకు ఎలాంటి ముప్పు లేదని నిర్ధారించుకున్న తర్వాతే ఆ విద్యార్థికి దేశంలోని విద్యాసంస్థల్లో చదువుకునేందుకు అనుమతిస్తూ స్టూడెంట్ వీసా మంజూరు చేస్తారు. ఈ ప్రక్రియ ద్వారా దేశ భద్రతకు ప్రాధాన్యతనిస్తూనే, అర్హులైన విద్యార్థులకు అవకాశం కల్పించాలని అమెరికా ప్రభుత్వం భావిస్తోంది.

ఈ సోషల్ మీడియా తనిఖీ ద్వారా తమ దేశంలోకి ప్రవేశించిన ప్రతి వ్యక్తిని సమగ్రంగా పరిశీలించడానికి వీలు కలుగుతుందని అమెరికా విదేశాంగ శాఖ సీనియర్ అధికారి తెలిపారు. వీసా కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల సామాజిక మాధ్యమ ఖాతాలను యూఎస్ కాన్సులర్ అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తారని వెల్లడించారు. ఇందుకోసం దరఖాస్తుదారులు తమ సోషల్ మీడియా ప్రొఫైళ్ల ప్రైవసీ సెట్టింగ్స్‌ను పబ్లిక్‌గా మార్చుకోవాల్సి ఉంటుందని తెలిపారు.

కాగా… అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌నకు వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. కోర్టు ఆదేశాల మేరకు విదేశీ విద్యార్థుల బహిష్కరణపై ట్రంప్‌ వెనక్కి తగ్గారు. తమ వీసాలు రద్దు చేయడంతో విదేశీ విద్యార్థులు అక్కడి న్యాయస్థానాలను ఆశ్రయించారు. దీంతో, విద్యార్థులకు అనుకూలంగా తీర్పులు రావడంతో ట్రంప్‌ యూటర్న్‌ తీసుకున్నారు.

ఈ క్రమంలోనే.. ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లి బహిష్కరణ ముప్పు ఎదుర్కొంటున్న వందల మంది విద్యార్థులకు ఊరట లభించింది. అయితే, అమెరికాలో విదేశీ విద్యార్థులపై ట్రంప్‌ సర్కార్ బహిష్కరణ వేటు వేసింది. ఈ క్రమంలోనే వివిధ కారణాలతో 187 కాలేజీలకు చెందిన 1200 మందికి పైగా విదేశీ విద్యార్థుల వీసా లేదా వారి చట్టబద్ధ హోదాలను ట్రంప్‌ ప్రభుత్వం రద్దు చేసింది. ఈ నేపథ్యంలో తమ వీసాల రద్దుపై విద్యార్థులు న్యాయస్థానాలను ఆశ్రయించారు.

కాలిఫోర్నియా, బోస్టన్‌ కోర్టుల్లో విద్యార్థులు పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై విచారణ జరిపిన ఆయా న్యాయస్థానాలు విద్యార్థుల వీసా రద్దును ఆపాలంటూ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ట్రంప్‌ యంత్రాంగం చర్యలను న్యాయస్థానం తోసిపుచ్చింది. ఈ క్రమంలోనే ఇమిగ్రేషన్‌ అండ్‌ కస్టమ్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆయా విద్యార్థుల చట్టబద్ధ హోదాను తాత్కాలికంగా పునరుద్ధరించింది. ఈమేరకు అమెరికా ప్రభుత్వానికి చెందిన ఓ న్యాయవాది తాజాగా వెల్లడించారు. దీంతో ఆయా విద్యార్థులకు చట్టబద్ధ హోదా లభిస్తుందన్నారు.

మరోవైపు.. విదేశీ విద్యార్థులకు వీసాలంటేనే చిర్రెత్తిపోతున్నారు ట్రంప్‌. రోజుకో రీతిలో ఆ వీసాలకు ఎసరు పెట్టేందుకు ఆలోచనలు చేస్తున్నారు. ఇప్పటికే అనేక మార్గాల్లో విదేశీ విద్యార్థుల సంఖ్యకు కోత పెట్టేందుకు చర్యలు చేపట్టిన ట్రంప్‌..ఇప్పుడు వర్సిటీల్లో 15 శాతం పరిమితిని విధిస్తామని స్పష్టం చేశారు. మరోవైపు సోషల్‌మీడియాలో క్లీన్‌చిట్‌ ఉంటేనే అమెరికాకు ఎంట్రీ ఉంటుందని ఇప్పటికే ప్రకటించింది యూఎస్ ప్రభుత్వం.

ట్రాఫిక్‌ నిబంధనలు పాటించకపోతే వీసా కట్ క్లాస్‌లకు బంక్‌ కొడితే వీసా కట్‌.. సోషల్‌ మీడియాలో వ్యతిరేకంగా పోస్ట్‌ పెడితే వీసా కట్‌ ఇలా అమెరికాలో విదేశీ విద్యార్థులను తగ్గించడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌. ఇతర దేశాల నుంచి చదువు కోసం వస్తున్న విద్యార్థులు అమెరికాలో సమస్యలు సృష్టిస్తున్నారన్న ట్రంప్‌.

హార్వర్డ్ యూనివర్సిటీతో పాటు ఇతర ఉన్నత విద్యా సంస్థల్లో విదేశీ విద్యార్థులపై 15 శాతం పరిమితి విధిస్తామని స్పష్టం చేశారు. విదేశీ విద్యార్థులు కారణంగా స్థానిక అమెరికన్ విద్యార్థులు మెరుగైన విద్యను పొందలేకపోతున్నారని మండిపడ్డారు. దేశ వ్యతిరేక భావజాలానికి కొన్ని వర్సిటీలు కేంద్రంగా మారుతున్నాయని ఆరోపించారు.

అందుకోసమే విద్యార్థుల వీసాలపై పరిమితి విధిస్తామని స్పష్టం చేశారు. అమెరికాలోని కొన్ని యూనివర్సిటీల ఆవరణల్లో ఇటీవల పాలస్తీనాకు మద్దతుగా పెద్దఎత్తున ఆందోళనలు జరిగాయి. ఈ విషయాన్ని మనసులో పెట్టుకొని ట్రంప్‌ సర్కారు విదేశీ విద్యార్థులపై ఆగ్రహంగా ఉంది. ఈ క్రమంలోనే పలు కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది.

అమెరికాలో ప్రస్తుతం 11 లక్షలకు పైగా విదేశీ విద్యార్థులు ఉన్నారు. వీరిలో 3 లక్షల మంది భారతీయ విద్యార్థులే. ట్రంప్‌ తీసుకుంటున్న వరుస నిర్ణయాలతో ఇప్పటికే అక్కడ ఉన్న విద్యార్థులతో పాటు అమెరికాలో చదవాలని ప్రణాళికలు వేసుకుంటున్న విద్యార్థులకు కూడా ఇబ్బందులు కలుగుతున్నాయి. అమెరికాలో చదువు కోసం దరఖాస్తు చేసుకునే విద్యార్థుల వీసా ఇంటర్వ్యూల షెడ్యూలింగ్‌ను ఇప్పటికే తాత్కాలికంగా నిలిపివేసింది అమెరికా ప్రభుత్వం.

దాంతో పాటు సోషల్ మీడియా వెట్టింగ్‌ను తెరపైకి తెచ్చింది. అమెరికాలో చదువుకోవడానికి దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల సోషల్‌ మీడియా ప్రొఫైళ్లను క్షుణంగా పరిశీలిస్తారు. ఆ తర్వాతే వారికి వీసా మంజూరు చేస్తారు. అప్పటివరకు విద్యార్థులకు వీసా ఇంటర్వ్యూ అపాయింట్‌మెంట్లను నిలిపివేశారు. ఉగ్రవాదులను నియంత్రించడం, యూదు వ్యతిరేకతను ఎదుర్కోవడమే లక్ష్యంగా ఈ తనిఖీ చేస్తున్నట్టు అమెరికా ప్రకటించింది.

సోషల్‌ మీడియా వెట్టింగ్‌ విదేశీ విద్యార్థుల వీసా ప్రక్రియపై పెను ప్రభావం చూపనుంది. దీంతో అమెరికా యూనివర్సిటీలపై ఆర్థికంగానూ భారం పడనుంది. 2024లో 2.7 లక్షలకు పైగా నమోదైన భారత విద్యార్థులతో అమెరికా ఆర్థికవ్యవస్థకు 43.8 బిలియన్‌ డాలర్ల ఆదాయం వచ్చింది. ఇప్పుడు ట్రంప్‌ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో ఈ ఆదాయానికి భారీగా కోతపడుతుందని వర్సిటీలు ఆందోళన చెందుతున్నాయి. మరోవైపు ఇటీవల హార్వర్డ్‌ యూనివర్సిటీకి అందించే నిధుల్లో ట్రంప్ ప్రభుత్వం కోత విధించింది.

ఆ తర్వాత ఏకంగా విదేశీ విద్యార్థులను చేర్చుకోవడానికి ఉన్న అనుమతిని రద్దు చేసింది. దీన్ని వ్యతిరేకిస్తూ యూనివర్సిటీ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. ట్రంప్‌ చర్య అనైతికమని నిబంధనలు ఉల్లంఘించడం అవుతుందని హార్వర్డ్‌ పేర్కొంది. దీనిపై విచారణ జరిపిన ఫెడరల్‌ కోర్టు న్యాయమూర్తి ట్రంప్‌ నిర్ణయాన్ని నిలుపుదల చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.

ఇదిలా ఉండగా విదేశీ విద్యార్థులపై బహిష్కరణ వేటు కారణంగా డిపోర్టేషన్‌, నిర్బంధం ముప్పు పొంచి ఉండటంతో ఆ విద్యార్థులు ఆందోళనకు గురయ్యారు. వీరిలో కొంతమంది ఇప్పటికే అమెరికాను వీడగా.. కొందరు రహస్య ప్రదేశాల్లో తల దాచుకున్నారు. తాజాగా కోర్టు వ్యాఖ్యలతో ట్రంప్‌ సర్కారు వెనక్కి తగ్గింది. ఈ నేపథ్యంలో విద్యార్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button