ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షాకు స్కోచ్ అవార్డు

Adilabad: భారతదేశాన్ని మెరుగైన దేశంగా మార్చడానికి కృషి చేసే వ్యక్తులు, ప్రాజెక్ట్లు, సంస్థలను స్కోచ్ గ్రూప్ గుర్తించి స్కోచ్ అవార్డు ద్వారా సత్కరిస్తుంది. ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షాకు స్కోచ్ అవార్డు లభించింది. ఈ మేరకు స్కోచ్ సంస్థల మేనేజింగ్ డైరెక్టర్ దీపక్ దలాల్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 29న ఢిల్లీలోని లోధి రోడ్లో గల ఇండియా హ్యబిటేట్ సెంటర్లో కలెక్టర్ ఈ అవార్డును అందుకోనున్నారు. బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఆరోగ్యంపై అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో కలెక్టర్ గతేడాది నవంబర్ 14న ఆరోగ్య పాఠశాల కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
ఉదయం ప్రార్థన సమయంలో ఆరోగ్య సంరక్షణకు అనుసారించాల్సిన విధానాలపై ఉపాధ్యాయులు, వైద్యు ల ద్వారా వారికి అవగాహన కల్పించారు. ప్రతీ వారం మండలానికి రెండు పాఠశాలల చొప్పున గైడ్ టీచర్లు, స్టూడెంట్ లీడర్లతో కలెక్టరేట్లో సమీక్షించి వారంలో పాఠశాలలో జరిగిన మార్పులను తెలుసుకుని మరింత పకడ్బందీగా అమలు చేసేలా దిశానిర్దేశం చేశారు. పాలనతో పాటు సమాజంలో మార్పు కోసం కృషి చేసిన కలెక్టర్ రాజర్షి షాకు ఈ స్కోచ్ అవార్డు వరించింది.