ACB Raids: శేరిలింగంపల్లి జోనల్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు

ACB Raids: మరో అవినీతి తిమింగలం ఏసీబీ అధికారులకు పట్టుబడింది. ఈసారి జీహెచ్ఎంసీ అర్బన్ బయోడైవర్సిటి డిప్యూటీ డైరెక్టర్ లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. ఓ బాధితుడి ఫిర్యాదు మేరకు శేరిలింగంపల్లి జోనల్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు చేపట్టింది. జోనల్ కార్యాలయంలోని అర్బన్ బయోడైవర్సిటి డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాస్ గదిలో రంగారెడ్డి జిల్లా ఏసీబీ డీఎస్పీ శ్రీధర్ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు.
అర్బన్ బయోడైవర్సిటి డిప్యూటీ డైరెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న శ్రీనివాస్ గత కొంతకాలంగా చాంద్రాయణ గుట్ట సర్కిల్ లో అర్బన్ బయోడైవర్సిటి విభాగం ఇంచార్జ్ గా వ్యవహరిస్తున్నారు. చాంద్రాయణ గుట్ట సర్కిల్ పనికి సంబంధించి ఓ కాంట్రాక్టర్ వద్ద 2లక్షలు లంచం డిమాండ్ చేశాడు. బాధితుడిని లంచం డబ్బులు తీసుకుని శేరిలింగంపల్లి జోనల్ కార్యాలయానికి రావాలని సూచించాడు. 70వేలు లంచం ఇస్తుండగా ఏసీబీ అధికారులు శ్రీనివాస్ను రెడ్ హ్యండెడ్గా పట్టుకున్నారు