పంజాబ్లో హత్యకు గురైన ఆప్ నేత జర్మాల్ సింగ్

పంజాబ్ లో ఆప్ నేత హత్యకు గురయ్యారు. పెళ్లి వేడుకలో అందరూ చూస్తుండగానే దుండగులు అతడిని కాల్చి చంపారు. ఈ ఘటన తార్న్ తరాన్ జిల్లాలో జరిగింది. మృతుడిని ఆప్ నేత, వాల్తోరా గ్రామ సర్పంచ్ జర్మాల్ సింగ్ గా గుర్తించారు. జర్మాల్ సింగ్ అమృత్ సర్ లోని ఓ ప్యాలెస్ కు పెళ్లి వేడుకకు హాజరయ్యారు. అక్కడ కూర్చుని ఉండగా పిస్టల్ కలిగిన ఇద్దరు యువకులు అతడి వెనుక నుంచి వచ్చి కాల్చారు. దీంతో అతడు అక్కడికక్కడే కుప్ప కూలిపోయాడు.
కాల్చిన వెంటనే నిందితులు అక్కడి నుంచి పారిపోయారు. జర్మాల్ పక్కనే ఉన్న వ్యక్తులు అతడిని సమీపంలోని ఆస్పత్రికి తీసుకెళ్లగా, అప్పటికే మరణించినట్లు చెప్పారు. పెళ్లి వేడుకలో చాలా మంది ఉన్నప్పటికీ దుండగుల్ని గుర్తించలేకపోయారు. కాగా ఈ ఘటనకు తామే బాధ్యులం అని గ్యాంగ్ స్టర్స్ ప్రభ్ దాసువాల్, డానీ బల్, ఇతరులు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. పంజాబ్లో గన్ కల్చర్ పెరుగుతుండటంపై ప్రభుత్వంపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి.



