ఆంధ్ర ప్రదేశ్

Tirupati: తిరుపతిలో దారుణం.. ఒకే కుటుంబంలోని 5గురు కిడ్నాప్

Tirupati: తిరుపతిలో ఒకే కుటుంబంలోని ఐదుగురిని కిడ్నాప్‌ చేసిన ఘటన సంచలనం సృష్టించింది. బాధితుడు రాజేశ్‌ కిడ్నాపర్ల చెర నుంచి తప్పించుకుని సమాచారం అందించడంతో, పోలీసులు బాధిత కుటుంబాన్ని రక్షించేందుకు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు.

ఆర్థిక లావాదేవీల కారణంతో ఒకే కుటుంబంలోని ఐదుగురిని కిడ్నాప్‌ చేసిన ఘటన తిరుపతిలో చోటు చేసుకుంది. రూ.రెండు కోట్లు ఇస్తేనే విడిచి పెడతామని బెదిరించిన ఈ ఘటన వెలుగులోకి రావడంతో పోలీసులు గాలింపు చేపట్టారు. తిరుపతి నగరం జీవకోనలో కాపురముంటున్న రాజేశ్‌, అతడి భార్య సుమతి రెండు మీసేవ కేంద్రాలు నిర్వహిస్తున్నారు.

పిల్లలు జాస్మిత, యోక్షిత, తల్లి విజయతో కలిసి ఈ దంపతులు ఉంటున్నారు. అదే ప్రాంతానికి చెందిన భార్గవ్‌ మూడేళ్ల క్రితం రాజేశ్‌ వద్ద అప్పు చేశాడు. డబ్బు తిరిగి ఇమ్మని రాజేశ్‌ అడుగుతుండడంతో భార్గవ్‌ కిడ్నాప్‌ ప్లాన్‌ చేశాడు. సెటిల్‌మెంట్లు, కిడ్నాప్‌లు చేయడంలో ఆరితేరిన అరుణ్‌ అనే వ్యక్తిని సంప్రదించి చెన్నై నుంచి కొందరు కిడ్నాపర్లను రప్పించారు.

కొత్త వ్యాపారం గురించి మాట్లాడాలని అరుణ్ ఫోన్ చేసి పిలువడంతో రాజేశ్‌, సుమతి, పిల్లలు, తల్లి విజయతో కలసి అపార్టుమెంటు వద్దకు వచ్చారు. అప్పటికే రెండు కార్లు సిద్ధం చేసుకుని ఉన్న కిడ్నాపర్ల బృందాలు రూ.రెండు కోట్లు ఇస్తేనే ఇక్కడి నుంచి పంపుతామని బెదిరించారు. అంత డబ్బు తమ వద్ద లేదని, చిత్తూరులో బంధువుల వద్దకు తీసుకెళితే తీసిస్తామని చెప్పారు.

దీంతో వారందరినీ కారులో తీసుకుని చిత్తూరుకు బయలుదేరారు. మార్గమధ్యంలోని ఐతేపల్లి వద్ద రాజేశ్‌ కిడ్నాపర్ల చెర నుంచి తప్పించుకుని కిందికి దూకేశాడు. తీవ్ర గాయాలపాలైన అతడిని స్థానికులు గమనించి తిరుపతి రుయాస్పత్రికి తరలించారు. కిడ్నాపర్ల చెరలో ఉన్న భార్య సుమతి, ఇద్దరు పిల్లలు, తల్లిని కాపాడాలని రాజేశ్‌ వేడుకున్నాడు. వెంటనే రంగంలోకి దిగిన చిత్తూరు, తిరుపతి పోలీసులు కిడ్నాపర్ల కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button