మన్మోహన్ సింగ్ భౌతిక కాయానికి నివాళులర్పించిన సీఎం రేవంత్ రెడ్డి

Revanth Reddy: మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి భౌతిక కాయానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాళులర్పించారు. మన్మోహన్ సింగ్ కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి సానుభూతిని తెలియజేశారు. నివాళులర్పించిన వారిలో ముఖ్యమంత్రితో పాటు రాష్ట్రానికి చెందిన పలువురు మంత్రులు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులు ఉన్నారు.
ప్రముఖ ఆర్థిక వేత్త, మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ మరణం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. డాక్టర్ మన్మోహన్ సింగ్ మరణంతో దేశం ఒక గొప్ప నాయకుడిని కోల్పోయిందని అన్నారు. ఆయన ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడే దేశంలో ఆర్థిక సంస్కరణలకు శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు.
ఒక ఆర్థికవేత్తగా, ఒక అధ్యాపడిగా, రిజర్వు బ్యాంకు గవర్నర్గా, రాజ్యసభ సభ్యుడిగా, ప్రతిపక్ష నాయకుడిగా, ప్రధానమంత్రిగా దేశానికి ఎనలేని సేవలు అందించారని కొనియాడారు. యూపీఏ ప్రభుత్వానికి నాయకత్వం వహించి పదేళ్లపాటు ప్రధానమంత్రిగా దేశంలో అనేక వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు. మన్మోహన్ సింగ్ మరణం పూడ్చలేనిదని అన్నారు. మన్మోహన్ సింగ్ ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు.